రిపబ్లిక్ సీ ఓటర్ సర్వే: వేగం తగ్గిన కారు... దూసుకెళుతున్న ప్రజాకూటమి
ఓ వైపు ఎన్నికల ప్రచారంలో నేతలు బిజీ... మరోవైపు సర్వేల సందడి వెరసి ఈ సారి ఎన్నికలు చాలా ఆసక్తికరంగా మారాయి. ప్రజలు ఎవరికి ఓటేస్తారో తెలియదుగానీ... సర్వేలు మాత్రం ఫలానా పార్టీ అధికారంలోకి వస్తుందంటూ జోస్యం చెబుతున్నాయి.
గులాబీ పార్టీకి పరాభవం తప్పదా..?
సర్వేల సందడి షురూ అయ్యింది. ఇక ఈనెలలోనే ఛత్తీస్గడ్ ఎన్నికలకు వెళ్లనుంది. దీంతో ఎలక్షన్ ఫీవర్ పీక్ స్టేజెస్కు చేరుకుంది. ఇక ఉత్తరాన ఎన్నికల కంటే తెలంగాణ ఎన్నికల వైపే చాలామంది రాజకీయ ఉద్దండులు దృష్టి సారించారు. తాజాగా రిపబ్లిక్ టీవీ సీఓటర్ సర్వే ఫలితాలు విడుదలయ్యాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలో ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తున్నారో ఆ సర్వే స్పష్టం చేసింది. 2019 లోక్సభ ఎన్నికల్లో గులాబీ పార్టీకి పరాభవం తప్పదని సర్వే స్పష్టం చేసింది.
కాంగ్రెస్ టీడీపీ కూటమికి 8 సీట్లు
తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలున్నాయి. ఇందులో టీఆర్ఎస్కు 7 సీట్లు దక్కనుండగా కాంగ్రెస్ టీడీపీ కూటమికి 8 సీట్లు దక్కనున్నట్లు సర్వే తెలిపింది. ఇక ఎప్పటిలాగే మజ్లిస్కు ఒక సీటు దక్కనుండగా.... బీజేపీ ఒక సీటుతో తృప్తిపడాల్సి వస్తుందని సర్వే వెల్లడించింది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ టీడీపీ కలయికతో తెలంగాణలో కాంగ్రెస్కు 6 సీట్లు దక్కనున్నట్లు జోస్యం చెప్పింది సర్వే. 2014లో టీడీపీకి ఒక సీటు రాగా 2019లో అది కూడా కోల్పోతుందని సర్వే స్పష్టం చేసింది.
కాంగ్రెస్ టీడీపీ కూటమికి 6.7శాతం ఓటు షేరు
2014 ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీకి 11 సీట్లు రాగా... 2019కి 4 సీట్లు కోల్పోయి 7స్థానాలకే పరిమితం కానుంది. ఇక ఓటు షేరు పరిశీలిస్తే... కాంగ్రెస్ టీడీపీ కూటమికి 6.7 శాతం ఓటు షేరు దక్కనుండగా... బీజేపీకి 3.8శాతం తెలంగాణలో ఓటుషేరు దక్కనున్నట్లు సర్వే అంచనా వేసింది. ఇక మజ్లిస్ పార్టీ తెలంగాణలో బలంగానే ప్రచారం చేయనుండటంతో ఆ పార్టీకి 2014 ఎన్నికలతో పోలిస్తే 2.5 శాతం ఓటు షేరు పెరిగినట్లు లెక్కలు కట్టింది రిపబ్లిక్ సీ ఓటర్ సర్వే.
అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గులాబీ పార్టీకి శృంగభంగమే?
ఇక అసెంబ్లీ ఎన్నికలు కూడా టీఆర్ఎస్కు చేదు అనుభవమే ఇవ్వనున్నట్లు సర్వే వెల్లడించింది. అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళుతున్న కేసీఆర్కు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందని సర్వే అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే ఫలితాలు కాస్త భిన్నంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నట్లు సర్వే పేర్కొంది. మహాకూటమికి 32.2 శాతం ఓట్లు, టీఆర్ఎస్ కు 30.4 శాతం ఓట్లు, బీజేపీకి 19 శాతం ఓట్లు, ఏఐఎంఐఎం కు 3.9 శాతం ఓట్లు లభిస్తాయని రిపబ్లిక్, సీ-వోటర్ సర్వే తెలిపింది. ఈ సారి ఎన్నికల్లో బలమైన గులాబీ పార్టీని ఢీకొట్టేందుకు టీడీపీ కాంగ్రెస్ జనసమితి వామపక్షాలు కలిసి పోటీచేస్తుండటమే గులాబీ పార్టీకి మైనస్గా మారిందని సర్వే చెబుతోంది.
ఓవరాల్గా తెలుగురాష్ట్రాల్లో చంద్రబాబుకు మైనస్
ఇక ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు భారీ మూల్యమే చెల్లించుకోనున్నారని సర్వే అభిప్రాయపడింది. ఇది కేవలం రాహుల్ గాంధీకే లబ్ధి చేకూరుతోంది తప్ప చంద్రబాబు నాయుడకు కాదని సర్వే వెల్లడించింది. చంద్రబాబు కాంగ్రెస్తో కలవడంతో ఎన్నికల పరంగా టీడీపీకి వచ్చిన లాభం ఏమి లేదని... కాంగ్రెస్కు మాత్రం అన్ని విధాలా కలిసొస్తున్నాయని సర్వే వెల్లడించింది.