తెలంగాణలో అర్ధరాత్రి నుంచి క్యాబ్ డ్రైవర్ల బంద్
తెలంగాణలో డిసెంబర్ 30 అర్ధరాత్రి నుంచి జనవరి 4 వరకు ఓలా, ఉబర్ క్యాబ్ డ్రైవర్లు బంద్ కు పిలుపునిచ్చారు.
హైదరాబాద్: నగరంలో ఉన్న ప్రయివేటు వాహనాల సంస్థలు ఓలా, ఉబర్ తమ డిమాండ్లు పరిష్కరించక పోవడాన్ని నిరసిస్తూ తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ఈరోజు అర్ధరాత్రి నుంచి బంద్ కు పిలుపునిచ్చింది. ఈ బంద్ జనవరి 4 వరకు కొనసాగుతుంది.
పెరిగిన వాహనాలు: ఓలా కార్యాలయంపై డ్రైవర్ల దాడి, బౌన్సర్లను చితకబాదారు
ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్షులు, సభ్యులు శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బంద్ ప్రకటన చేశారు. ఓలా, ఉబర్ లో ఉన్న షేర్ బుకింగ్ ను రద్దు చేయాలని, రోజుకు 18 బుకింగ్ ల లక్ష్యాన్ని తగ్గించి ఇన్సెంటివ్ పెంచాలని వారు డిమాండ్ చేశారు.
రోజుకు 12 ట్రిప్పులతో కూడిన వ్యాపారం ఇవ్వడంతోపాటు పీక్ అవర్స్ తో సంబంధం లేకుండా ఒకే స్కేల్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలను పరిష్కరించాలని ఓలా యాజమాన్యాన్ని నిలదీసినందుకు ద్రైవర్లపై బోవ్న్సర్లతో దాడి చేయించారని తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శివ మీడియా సమావేశంలో వివరించారు.
తమ డిమాండ్లు నేరవేర్చకపోవడం వల్లనే 30వ తేదీ అర్ధరాత్రి నుంచి వచ్చే నెల 4 వరకు బంద్ చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. బంద్ సమయంలో ఓలా, ఉబర్ తరుపున క్యాబ్ లు గనుక తిరిగితే వాటిని నగరంలో ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు.