మాదాపూర్లో 'క్యాబ్' బీభత్సం: ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు..
క్యాబ్ బీభత్సానికి మహిళా కార్మికులు తీవ్ర గాయాలపాలై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
హైదరాబాద్: మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఓ క్యాబ్ బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్లే క్రమంలో అదుపు తప్పి.. పక్కనే పారిశుద్ద్య పనిచేస్తున్న కార్మికులను ఢీకొట్టింది. దీంతో మంజుల, శాంతమ్మ అనే ఇద్దరు పారిశుద్ద్య కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
అదే సమయంలో మరో ఇద్దరు కార్మికులు కూడా అక్కడ రోడ్లు ఊడుస్తున్నారు. అయితే వారిద్దరు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. క్యాబ్ భీభత్సానికి మహిళా కార్మికులు తీవ్ర గాయాలపాలై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటన తర్వాత పోలీసులు అక్కడి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. క్యాబ్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని వివరాలు రాబడుతున్నట్లు తెలుస్తోంది.
కాగా, ఈ దుర్ఘటనతో తోటి మహిళా కార్మికులు భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. రోజూ లాగే విధులు నిర్వర్తిస్తుండగా ఇలాంటి ఘటన జరగడం.. అసలు ఊహించలేదని వారు వాపోయినట్లు సమాచారం.