రైతులకు బీమా, ఏడు జోన్లు-రెండు మల్టీ జోన్లకు కేబినెట్ ఆమోదం: ఢిల్లీకి బయలుదేరిన కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్ల వ్యవస్థకు రాష్ట్ర కేబినెట్ ఆదివారం ఆమోదం తెలిపింది. ఎల్ఐసీ ద్వారా రైతులకు జీవిత బీమా కల్పించేందుకు కూడా అంగీకారం తెలిపింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో మంత్రివర్గ సమావేశం జరిగింది.
జోనల్ వ్యవస్థ, రైతు జీవిత బీమాపై చర్చ, ఆమోదం ప్రధాన ఎజెండాగా సమావేశమైంది. జోన్ల వ్యవస్థ, రైతులకు జీవిత బీమా అంశంపై విస్తృతస్థాయిలో చర్చ సాగింది. ఈ రెండు అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలు ఇలా ఉన్నాయి.
- తెలంగాణలో ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్ల ఏర్పాటు. తెలంగాణలో ఇకపై ఉద్యోగుల నియామకానికి జిల్లా, జోన్, మల్టీ జోన్, స్టేట్ కేడర్లు ఉంటాయి. స్టేట్ కేడర్ పోస్టులను కచ్చితంగా పదోన్నతి ద్వారానే భర్తీ చేస్తారు.
- ఒకటి నుంచి ఏడో తరగతి వరకు విద్యాభ్యాసంలో కనీసం నాలుగు సంవత్సరాలు ఎక్కడ చదువుతారో ఆ ప్రాంతాన్నే సదరు అభ్యర్థి స్థానిక ప్రాంతంగా (లోకల్ ఏరియా) గుర్తిస్తారు.
- అన్ని పోస్టులకు 95 శాతం లోకల్, 5 శాతం ఓపెన్ కేటగిరీగా ఉంటుంది.
- రాష్ట్రంలోని 18-60 ఏళ్ల వయస్సున్న ప్రతి రైతుకు రూ.5 లక్షల జీవిత బీమా వర్తిస్తుంది. ఎల్ఐసీ ద్వారా జీవిత బీమా అమలు చేస్తారు. ప్రతి రైతుకు రూ.2,271 చొప్పున ప్రతి ఏడాది ప్రీమియం కడతారు. బీమా ప్రీమియంకు సంబంధించిన సొమ్మును ప్రభుత్వం బడ్జెట్లో కేటాయిస్తుంది. జూన్ 2 నుంచి రైతుల నుంచి నామినీ ప్రతిపాదన పత్రాలు సేకరిస్తారు. ఆగస్టు 15 నుంచి బీమా సర్టిఫికేట్లు అందిస్తారు.
- వైద్య ఆరోగ్య శాఖలో టీచింగ్ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయో పరిమితిని 58 నుంచి 65కు పెంచుతారు.
- రాష్ట్రపతి సమన్వయ సమితికి ఎండీతో పాటు ఇతర సిబ్బందిని నియమిస్తారు.
కాగా, జోన్ల వ్యవస్థకు సంబంధించిన రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కేరంందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ సమావేశం అనంతరం న్యూఢిల్లీకి బయలుదేరారు.