28న క్యాబినెట్ భేటీ...! కొత్త రెవెన్యూ, పురపాలక చట్టాలకు ఆమోదం తెలిపే ఛాన్స్..!!
Recommended Video
హైదరాబాద్: తెలంగాణ మంత్రిమండలి సమావేశాన్ని ఈ నెల 28న నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ భేటీలో కొత్త రెవెన్యూ, పురపాలక చట్టాలకు ఆమోదంతోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి సోమవారం అన్ని శాఖలకు మంత్రిమండలి సమావేశంపై సమాచారం పంపించారు. ఆయా శాఖలకు సంబంధించి తీసుకోవాల్సిన నిర్ణయాలు, పెండింగు అంశాలపై ఈ నెల 25లోగా వివరాలు ఇవ్వాలని సూచించారు.
శాఖల ప్రక్షాళన..! మంత్రివర్గ భేటీలో కీలక నిర్ణయాలు..!!
పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ఈ నెల 23న వెలువడనున్నాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఈ నెల 14తో ఎన్నికలు ముగుస్తున్నాయి. మొత్తంగా అన్ని ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత మంత్రిమండలి భేటీ నిర్వహించాలని సీఎం భావిస్తున్నారు. దీని కోసం అన్ని శాఖల నుంచి సమాచారం కోరారు. ఆయా శాఖల సమూల పక్షాళలకు కొత్త రెవెన్యూ, పురపాలక చట్టాల రూపకల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
కొత్త రెవెన్యూ, పురపాలక చట్టాలకు ఆమోదం..! పారదర్శక పాలనే లక్ష్యం...!!
ఈ చట్టాల ముసాయిదాలను ఈ నెల మూడో వారంలోగా పూర్తి చేయనున్నారు. ఆ వెంటనే శాసనసభలో ప్రవేశపెట్టేందుకు వీలుగా బిల్లులను తయారు చేస్తారు. వాటిపై మంత్రిమండలిలో చర్చించి ఆమోదం తెలుపుతారు. పలు పాలనాపరమైన అంశాలకూ మంత్రిమండలి పచ్చజెండా ఊపనుంది. ఎన్నికల నియమావళి ముగుస్తున్నందున రైతుబంధు, ఆసరా, ఇతర పథకాల సాయం పెంపు వంటి వాటికి కూడా మంత్రిమండలి ఆమోదముద్ర వేసే అవకాశాలు ఉన్నాయి.
మూడు రోజులపాటు శాసనసభ, మండలి సమావేశాలు..!
జూన్ రెండో తేదీ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉద్యోగాల భర్తీ, వివిధ నిర్మాణాలకు స్థలాల కేటాయింపు, ఇతర అంశాలపై కీలక నిర్ణయాలుంటాయని తెలుస్తోంది. రాష్ట్ర మంత్రిమండలి సమావేశానికి తేదీ ఖరారు కావడంతో శాసనసభ, మండలి సమావేశాలపైనా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఈ నెల 29 నుంచి 31 వరకు మూడురోజులపాటు శాసనసభ, మండలి సమావేశాలు జరిపే వీలుంది.
29 నుంచి 31 వరకు శాసనసభ, మండలి సమావేశాలు..! రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం..!!
ఈ సమావేశాల్లో కొత్త రెవెన్యూ, పురపాలక చట్టాలపై చర్చించి ఆమోదం తీసుకోవాలని సీఎం నిర్ణయించారు. 28న మంత్రిమండలి ముసాయిదాను ఆమోదించిన వెంటనే 29 నుంచి జరిగే శాసనసభా సమావేశాల్లో ఈ రెండు చట్టాలపై చర్చించి ఆమోదం తీసుకుంటారు. ఆ తర్వాత వాటిపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు.