మోడీ క్యాబినెట్: తెలంగాణకు మొండిచేయి, తెరాస కోసమే ఖాళీ
తెరాసకు మంత్రివర్గంలో చోటు కల్పించే యోచనలో ప్రధాని ఉన్నారని, దానిపై చర్చల కోసమే కెసిఆర్ ఢిల్లీ వెళ్లారని ప్రచారం సాగింది.
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గాన్ని పునర్వ్యస్థీకరిస్తున్న తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) చీఫ్ కె చంద్రశేఖర రావు ఢిల్లీ వెళ్లారు. దీనిపై పుకార్లు షికార్లు చేశాయి. తెరాసకు మంత్రివర్గంలో చోటు కల్పించే యోచనలో ప్రధాని ఉన్నారని, దానిపై చర్చల కోసమే కెసిఆర్ ఢిల్లీ వెళ్లారని ప్రచారం సాగింది.
దానికితోడు, తెలంగాణ నుంచి మంత్రివర్గంలోకి తీసుకునే వారంటూ కొందరి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే చివరకు తెలంగాణకు మంత్రివర్గంలో చోటే లేకుండా పోయింది. తెరాసను తన మంత్రివర్గంలో చేర్చుకోవడానికే ప్రధాని మోడీ ఖాళీ ఉంచినట్లు ప్రచారం సాగుతోంది.
తెరాసకు మంత్రివర్గంలో ఓ క్యాబినెట్, ఓ సహాయ మంత్రి పదవులు ఇస్తామని బిజెపి అగ్రనేతలు చెప్పినట్లు సమాచారం. అయితే, దానికి కెసిఆర్ ఆంగీకరించలేదని అంటున్నారు. ఏదో విధంగా తెరాసను ఎన్డిఎలో చేర్చుకోవాలనే తెలంగాణకు మంత్రివర్గంలో మోడీ చోటు కల్పించలేదని అంటున్నారు.
మాకేం అభ్యంతరం లేదు...
తాము తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తామని, ఏ విధమైన పొత్తులు ఉండవని రాష్ట్ర బిజెపి నాయకులు చెబుతూ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికార టిఆర్ఎస్తో కలిసే ప్రసక్తే లేదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ ఆదివారంనాడు స్పష్టం చేశారు. కానీ, జాతీయ నాయకత్వం ఆలోచన మరో విధంగా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా మోడీ తెరాసను ఎన్డిఎలోకి తీసుకు రావాలనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.
బిజెపికి దూరంగానే ఉంటాం....
బిజెపికి దగ్గరయ్యే సమస్యే లేదని తెరాస నాయకులు తెగేసి చెబుతున్నారు. వచ్చే 18 నెలల్లో ఎన్నికలు వచ్చే ప్రస్తుత తరుణంలో తాము కేంద్ర మంత్రివర్గంలో చేరితే అది ఆత్మహత్యాసదృశ్యమే అవుతుందని అంటున్నారు. మంత్రివర్గంలో చేరితే కాంగ్రెసు బలపడుతుందని వారంటున్నారు. దానికితోడు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీని ముస్లింలు నమ్మబోరని, వారు తమకు దూరమైతే కాంగ్రెసు బలపడుతుందని వారు భావిస్తున్నారు.
దత్తాత్రేయను తీసుకోకపోవడంపై....
బిజెపి ఎన్నికల్లో విజయం సాధించి, మోడీ తొలి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినప్పుడు బండారు దత్తాత్రేయకు మంత్రి పదవి ఇవ్వకపోవడాన్ని తెరాస తప్పు పట్టింది. సికింద్రాబాదు నుంచి విజయం సాధించిన దత్తాత్రేయను విస్మరించడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ తర్వాత దత్తాత్రేయను మోడీ మంత్రివర్గంలోకి తీసుకున్నప్పుడు కెసిఆర్ హర్షించారు. బండారు దత్తాత్రేయను బంగారు దత్తాత్రేయగా అభివర్ణించారు.
దత్తాత్రేయను తొలగించడంపై...
బండారు దత్తాత్రేయను మోడీ మంత్రివర్గం నుంచి తొలగించడాన్ని తెరాస నాయకులు తప్పు పడుతున్నారు.కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణకు చోటు లేక పోవడం మంచి సంకేతం కాదని ఐటి శాఖ మంత్రి కెటి రామారావు అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రివర్గంపై నెట్ జన్లో ట్విట్టర్లో కెటిఆర్ను ప్రశ్నించగా, ఆయన సమాధానం చెప్పారు. కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ నుంచి ఏకైక ప్రతినిధి బండారు దత్తాత్రేయ ఉన్నారు. ఈ విస్తరణలో దత్తాత్రేయను తొలగించారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో తెలంగాణకు చోటు లేకపోవడంపై స్పందించాలని నెట్ జన్ ట్విట్ చేయగా, ఇది మంచి సంకేతం కాదని అన్నారు.