కేటీఆర్కు యోగీ సర్కార్ పిలుపు..! మహాకుంభమేళాలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం..!!
హైదరాబాద్: రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం గాని, శాశ్వత మిత్రత్వంగాని అస్సలు ఉండదు సుమీ..! ఎప్పుడు ఎవరు ఎవర్ని ఎందుకు మచ్చిక చేసుకుంటారో ఎవరికి అంతుచిక్కదు. ఇక ఒక్కోసారి రాజకీయ సంప్రదింపులు మరీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. పలానా రాజకీయ పార్టీ నేత పలానా నాయకున్ని కలుస్తారని కలలో కూడా ఊహించం. కాని అది కళ్ల ముందు జరిగిపోతుంటుంది.
ఆలింగనం
ఇలాంటి విచిత్ర సంఘటనలు అన్నీ రాజకీయాల్లోనే జరుగుతుంటాయి. తెలంగాణ ముదస్తు ఎన్నికల్లో నిన్నటి వరకూ ఒకరిని ఒకరు దూషించుకున్న బీజెపి, గులాబీ పార్టీలు ఇప్పుడు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటున్నాయి. రాష్ట్ర బీజేపితో టీఆర్ఎస్ పార్టీకి అంత సఖ్యత లేకపోయినప్పటికి కేంద్ర బీజేపి నాయకులతో మంచి స్నేహాన్నే కొనసాగిస్తున్నారు టీఆర్ఎస్ నేతలు.
కల్వకుంట్ల తారకరామారావుకు
తాజాగా యూపి ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ యూపీ లో జరిగే ఆద్యాత్మిక కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుకు ఆహ్వానం పంపి రెండు పార్టీల మద్య ఉన్న స్నేహాన్ని చెప్పకనే చెప్పారు. పార్టీలకతీతంగా శుభకార్యాలకు, ఆద్యాత్మిక కార్యక్రమాలకు హాజరవ్వడం సర్వసాధారణమనే చర్చ కూడా జరుగుతోంది.
కేటీఆర్ దగ్గరికి వెళ్లి
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఉత్తరప్రదేశ్ మంత్రి మంత్రి సతీశ్ మహానా శనివారం కలుసుకున్నారు. హైదరాబాద్ కు వచ్చిన ఆయన స్వయంగా కేటీఆర్ దగ్గరికి వెళ్లి మరీ కలిశారు. జనవరి 15 నుంచి ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్(ప్రయాగరాజ్)లో జరగబోయే మహా కుంభమేళాకు రావాలని కేటీఆర్ను ఆహ్వానించారు. దేశంలో జరిగే నదీ పుష్కరాల్లో అత్యంత ప్రఖ్యాతమైంది మహాకుంభమేళా. గంగానదికి 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ మహాకుంభమేళాకు దేశ వ్యాప్తంగా పలువురిని ఆహ్వానింస్తోంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఇందులో భాగంగానే తెలంగాణ నుంచి కేటీఆర్ను ఆహ్వానించారు. కేటీఆర్తో పాటు మరికొంత మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందనున్నాయి.