హైదరాబాద్లోనూ కాల్మనీ: యువతిని వేధించిన కడప ఫైనాన్షియర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ తరహా కాల్మనీ వ్యవహారం తెలంగాణ రాజధాని హైదరాబాదులోనూ వెలుగుచూసింది. ఐదు లక్షలు అప్పుగా ఇచ్చి, 8.30 లక్షలు చెల్లించిన తర్వాత కూడా మరో ఐదు లక్షలు చెల్లించాలంటూ కడప జిల్లాకు చెందిన హైదరాబాద్ నివాసి వీరసుబ్రహ్మణ్యం రెడ్డి అనే ఫైనాన్షియర్ వేధిస్తున్నాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆ వ్యవహారానికి చెందిన వివరాలు ఇలా ఉన్నాయి - హైదరాబాదులోని లంగర్హౌస్లో ఉంటున్న ఓ యువతి అవసరాల కోసం సుబ్రహ్మణ్యం రెడ్డి వద్ద ఐదు లక్షల రూపాయలు అప్పు తీసుకుంది. నెల లోపల ఆరు లక్షలు చెల్లించాలని అతను షరతు విధించాడు.
ఆమె మూడు నెలల క్రితం అప్పు చేసింది. అయితే ఇప్పటికే ఆమె 8.30 లక్షల రూపాయలు చెల్లించింది. అయితే, అదంతా వడ్డీకిందికే జమ కట్టుకున్న వీరసుబ్రహ్మణ్యం రెడ్డి అసలు ఐదు లక్షలు ఇవ్వాలని వేధించడం మొదలు పెట్టాడని యువతి ఆరోపించింది.
తనను మానసికంగా, శారీరకంగా అతను వేధిస్తున్నాడని యువతి ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిసంది. చెక్బుక్కు, పాస్పోర్టు కూడా లాక్కున్నాడని ఆరోపించింది. దాంతో పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పాటై వీరసుబ్రహ్మణ్యం రెడ్డి నివాసంలోనూ కార్యాలయంలోనూ సోదాలు నిర్వహించి బ్లాంక్ చెక్కులు, పాస్పోర్టు స్వాధీనం చేసుకున్నారు.
తాను చెల్లింపులు చేసిన ప్రతిసారీ యువతి ఫోన్లో వీరసుబ్రహ్మణ్యం రెడ్డికి మెసేజ్ పంపుతూ వచ్చింది. పోలీసులు వీరసుబ్రహ్మణ్యం రెడ్డిని, అతని బావమరిదిని అదుపులోకి తీసుకున్నారు. వీరసుబ్రహ్మణ్యం రెడ్డి హైదరాబాదులోనూ ఇతర ప్రాంతాల్లోనూ ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం.