ఆంటీ అని ప్రేమగా పిలుస్తాడు..! ఏంటీ అని సమాధానం ఇచ్చారో.. మీగొలుసు మాయం ఐనట్టే..!!
హైదరాబాద్ : మోసాలకు హద్దూ అదుపూ లేకుండా పోతోంది. అలాగే కొత్త కొత్త పద్దతులతో మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ఆడా మగా, చిన్నా పెద్దా, ముసలి ముతక తేడా లేకుండా దోచేసుకోవడమే లక్ష్యంగా రోడ్లపై పడుతున్నారు యెదవలు. ఆ మద్య వరకూ బేక్ పై ఉరుము వేగంతో వచ్చి మహిళల మెడలో గొలుసులు తెంచుకుని మెరుపు వేగంతో వెళ్లిన సంఘటనలు చూసాం. కానీ ప్రేమగా ఆంటీ అని దగ్గర బంధువుగా పలకరించి ఏంటీ అనే సమాధానం ఇస్తే గనక మీ మెడలోని గొలుసు మాయం ఐనట్టే.. ప్రస్తుతం ఇలాంటి కొత్త తరహా మోసంతో మహిళలు అవాక్కవుతున్నట్టు తెలుస్తోంది.
ఉదయం 5 నుంచి 6 గంటల మధ్యనే స్నాచింగ్లు..! అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు...!!
ఆంటీ...అని పిలుస్తున్నారు... ఏంటి చిన్నా అనే తిరిగి చూసేలోపు గొలుసును తెంపేస్తున్నారు... ఇది చైన్ స్నాచర్ల నయా నేర ప్రక్రియ. అది కూడా తెల్లవారుజాము 5 నుంచి 6 గంటల మధ్య స్నాచింగ్లకు పాల్పడుతున్నారు. ఈ తరహాలో ఇటీవల సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మూడు స్నాచింగ్లు జరిగాయి. ఈ ఘటనలపై అధ్యయనం చేసిన పోలీసులు స్నాచర్ల నేర ప్రక్రియను గమనించారు. ఈ స్నాచర్లు నిద్రమత్తును ఆసరగా చేసుకుని తెల్లవారుజాము ఇంటి ముందు వాకిలిని శుభ్రం చేసే మహిళలను టార్గెట్ చేసుకుని స్నాచింగ్లకు పాల్పడుతున్నారని తెలుస్తుంది.
ఉదయాన్నే వాకిట్లో ముగ్గేస్తున్నారా..! పరిసరాలు గమనించుకోకపోతే బొగ్గే...!!
పథకం ప్రకారమే మాదాపూర్, బాచుపల్లి, కేపీహెచ్బీ పరిధిల్లో స్నాచింగ్లు జరిగాయి. ఈ మూడు చోట్ల స్నాచింగ్లకు పాల్పడింది ఒకే ముఠాగా అనుమానాలు ఉన్నా యి. బైక్పై వస్తున్న ఇద్దరిలో వెనుకాల కూర్చున్న వ్యక్తి గొలుసులు తెంపేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మూడింట్లో ఒక చోట బైక్ దిగి వచ్చిన వ్యక్తి ఆంటీ..పిలిచి గొలుసు లాక్కెళ్లగా, మరో రెండు చోట్ల ఏదో పలకరించినట్లుగా వచ్చి కొద్ది దూరం నుంచే చైన్లను లాగేసినట్లు పోలీసుల పరిశీలనలో తేలింది.
నేరస్తుల కొత్త పోకడలు..! వరస కలిపి వాయిస్తున్న కేటుగాళ్లు..!!
మొత్తానికి ఈ సరికొత్త నేరప్రక్రియతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.. మహిళలు జాగ్రత్తగా ఉండాలని, ఉదయం నిద్రమత్తులో బయటికి వచ్చే మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఆ సమయంలో గుర్తు తెలియనివారు పలకరించేందుకు ముందుకు వస్తే అప్రమత్తం కావాలని పోలీసులు సూచిస్తున్నారు.
అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలి..! మహిళలకు ప్రత్యేక సూచనలు చేస్తున్న పోలీసులు..!!
ఎవరైనా అపరిచి వ్యక్తి ఆంటీ అని పిలవగానే ఏంటీ అని సమాధానం ఇవ్వకుండా వెంటనే ఇంట్లో వారిని పిలువాలి లేదా గట్టిగా కేకలు పెట్టాలని పోలీసు ఉన్నతాదికారులు చెప్పుకొస్తున్నారు. మీ కాలనీలో ఉదయం సమయాల్లో ఎప్పుడు లేని విధంగా ఎవరైనా బైక్ల మీద అనుమానాస్పదంగా తిరుగుతుంటే వెంటనే వారి ఫొటోలు తీసుకోవాలి. నంబర్ను గుర్తించేందుకు ప్రయత్నించాలి. ఆ సమాచారాన్ని పోలీసులకు లేదా డయల్ 100కు అందించాలి. ఈ మూడు స్నాచింగ్లకు సంబంధించిన అనుమానితులను గుర్తించేందుకు సీసీ కెమెరాలను విశ్లేషిస్తున్నామని పోలీసులు చెప్తున్నారు.