చెస్ట్ ఆసుపత్రి తరలింపు: సంతకాల ఉద్యమం(ఫోటో)
హైదరాబాద్: ఎర్రగడ్డలోని ఆసుపత్రిని తరలించాలన్న తెలంగాణ ప్రభుత్వ యోచనను నిరసిస్తూ ఎఐఎస్ఎఫ్, ఎఐవైఎఫ్ ఆధ్వర్యంలో సంతకాల ఉద్యమాన్ని చేపట్టింది. గురువారం నారాయణ గూడ చౌరస్తా వద్ద సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు డాక్టర్ కె. నారాయణ తొలి సంతకం చేసి సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు.
అనంతరం నారాయణ మాట్లాడుతూ ఛాతి ఆసుపత్రిని తరలించాలన్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాస్తు పేరుతో సచివాలయాన్ని ఎర్రగడ్డలోని ఛాతి ఆసుపత్రిలో నిర్మించాలన్న నిర్ణయం సమంజసం కాదన్నారు. అనేక ఏళ్లుగా పేద రోగులకు వైద్యం అందిస్తున్న ఛాతి ఆసుపత్రిని వికారాబాద్లోని అనంతగిరికి తరలించాలన్న నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు.
ప్రతి ఏటా సుమారు 59 వేల మంది పేద రోగులకు వైద్యం అందిస్తున్న ఈ ఆసుపత్రిని తరలించడం వల్ల పేదలకు వైద్యం అందకుండా పోతుందని తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. కార్పోరేట్ ఆసుపత్రులను ప్రోత్సహించడంలో భాగంగానే ఛాతి ఆసుపత్రిని తరలిస్తున్నారని ఆరోపించారు.
అన్ని హంగులతో, అన్ని సౌకర్యాలతో, నగరం నడిబొడ్డున ప్రస్తుతం సచివాలయం ఉన్నప్పటికీ, తరలించాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల హామీలను పక్కనబెట్టడానికే ఈ అంశాన్ని తెరమీదకి తెచ్చి గందరగోళ పరిస్ధితిని నెలకొల్పారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేకపోతే అన్ని పార్టీలను, ప్రజా సంఘాలను, మేధావులను కలుపుకొని ఉద్యమిస్తానని నారాయణ హెచ్చరించారు.