దుబ్బాక బైపోల్ ప్రత్యేకమే: ముగిసన ప్రచారం, కరోనా రూల్స్, బ్యాలెట్ పోలింగ్, 3న ఎన్నికలు, 10న రిజల్ట్స
దుబ్బాక: దుబ్బాక ఉపఎన్నిక ప్రచార గడువు ముగిసింది. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి ప్రచార మైకులన్నీ మూగబోయాయి. నవంబర్ 3న ఎన్నికలు జరగనుండగా, 10 ఫలితాలు వెలువడనున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో దుబ్బాకలో ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే.
Recommended Video
దుబ్బాకలో హోరాహోరీ ప్రచారం..
ఈ ఉపఎన్నిక బరిలో 23 మంది అభ్యర్థులు నిలిచినప్పటికీ ప్రధాన పోటీ మాత్రం అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఉండనుంది. టీఆర్ఎస్ తరపున సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాత, బీజేపీ తరపున రఘునందన్ రావు, కాంగ్రెస్ తరపున చెరుకు శ్రీనివాస్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఈ మూడు పార్టీలు కూడా జోరుగా ప్రచారం సాగించాయి. ముఖ్యంగా, టీఆర్ఎస్, బీజేపీలో ప్రచారంలో జోరు చూపించారు. టీఆర్ఎస్ అభ్యర్థి తరపున మంత్రి హరీశ్ రావు అన్నితానై ప్రచారం నిర్వహించారు. రఘునందన్ రావు తరపున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఇతర నేతలు ప్రచారం నిర్వహించారు.
కరోనా నిబంధనలతో పోలింగ్..
కాగా, దుబ్బాక ఉప ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కరోనా ప్రోటోకాల్ పాటిస్తూ ఎన్నికల నిర్వహించనున్నారు. 315 పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రానికి 1000 మంది లోపు ఓటర్లను కేటాయించారు. పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సారి కొత్తగా కోవిడ్ నిబంధనల మేరకు ప్రతి పోలింగ్ కేంద్రాల వద్ద భౌతిక దూరం పాటించేలా మార్కింగ్, ఓటు వేసేందుకు మాస్క్ తప్పనిసరి. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు మైక్రో అబ్జర్వర్లు, సీసీ కెమెరాలు, వీడియో గ్రాఫిలను ఏర్పాటు చేశారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ పూర్తయింది. 3600 మంది సిబ్బంది ఎన్నికలలలో పాల్గొంటారు.
ఉపఎన్నికలో తొలిసారి బ్యాలెట్....
కాగా, దుబ్బాక నియోజకవర్గంలో 1,98,756 మంది ఓటర్లు అభ్యర్తుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 315 పోలింగ్ కేంద్రాలు ఉండగా, 89 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా ఎన్నికల అధికారులు గుర్తించారు. ఉపఎన్నికలు సజావుగా జరిగేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా, మొదటి సారి ఈ ఉప ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ అవకాశం ఉంది. 80 సంవత్సరాలు, దివ్యాంగులు, కోవిడ్ రోగులు ఈ పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవాలి. ప్రతి పోలింగ్ కేంద్రాల వద్ద థర్మల్ క్రీనింగ్ ఏర్పాటు చేశారు. కోవిడ్ రోగులు చివరి గంటలో ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఇప్పటివరకు రూ. 58 లక్షలు సీజ్ చేయగా, 58వేల విలువైన ఆభరణాలను పట్టుకున్నామని సంబంధిత అధికారులు తెలిపారు. 22 ఫిర్యాదులు వచ్చాయన్నారు.
పటిష్ట భద్రత ఏర్పాట్లు.. మద్యం దుకాణాలు బంద్
పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ ఉంటుందని, 144 సెక్షన్ సాయంత్రం 6 గంటల నుండి 4వ తేదీవరకు అమల్లో ఉంటుందన్నారు. 89 సమస్యాత్మక ప్రాంతాల్లో 33 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఇందులో కేంద్ర బలగాలు బందోబస్తు ఉంటాయి. 2 వేల మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తారు. పోలింగ్ రోజున వంద మీటర్ల లోపు పార్టీ ప్రచారం, జెండాలు ఉండకూడదు. దుబ్బాక నియోజకవర్గంలో ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి ఎన్నికలు ముగిసేవరకు మద్యం దుకాణాలు మూసివేస్తారు.