రేపే ఉపఎన్నిక: భారీ భద్రత, తొలి ఓటరుకు గులాబీతో స్వాగతం, కానిస్టేబుల్ మృతి
హైదరాబాద్: వరంగల్ లోక్సభ స్థానానికి రేపు ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు.
శనివారం వరంగల్ ఉపఎన్నికను దృష్ట్యా ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడారు. 20 కంపెనీల పోలీసు బలగాలను నియోజకవర్గాల్లో మోహరించారు. కాగా, ఈ లోక్సభ ఉపఎన్నిక బరిలో 23 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారన్నారు. మొత్తం ఓటర్లు 15,09,671. నియోజకవర్గంలో 1,778 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఆమె తెలిపారు.
శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలవుతుందన్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుందన్నారు. సాయంత్రం 5 గంటల వరకు క్యూలో ఉన్న వారందరికి ఓటు వేసే అవకాశం ఇస్తామన్నారు. ఈవీఎంలపై అభ్యర్థుల ఫోటోను ఏర్పాటు చేశామన్నారు.
పోలింగ్ ప్రక్రియను 5 వందల మంది వీడియో గ్రాఫర్లతో చిత్రీకరిస్తున్నామని వెల్లడించారు. అయితే పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసేందుకు వచ్చే తొలి ఓటురకు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికుతామన్నారు. కాగా, ఎలక్షన్ కమిషన్ కొత్తగా తొలి ఓటరుకు ఘన స్వాగతం పలికే పద్ధతిని ప్రవేశపెట్టినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ గురువారం మీడియాకు తెలిపారు.
అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎవరైతే మొదట ఓటు వేసేందుకు వస్తారో వారికి, అక్కడున్న ఎన్నికల సిబ్బందికి పుష్పగుచ్ఛం ఇచ్చి లోపలికి సాదరంగా ఆహ్వానిస్తారని చెప్పారు. అయితే ఈ నిర్ణయం పట్ల విపక్ష పార్టీలు అభ్యంతరం తెలిపాయి. తొలి ఓటరుకు గులాబీ పూలు ఇవ్వడమేంటని ప్రశ్నించారు.
వరంగల్ ఉపఎన్నిక బందోబస్తుకు వచ్చిన కానిస్టేబుల్ మృతి
వరంగల్ లోక్ సభ ఉపఎన్నిక పోలింగ్ బందోబస్తుకు వచ్చిన ఎం.రాజు అనే పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందాడు. వరంగల్ జిల్లాలోని రఘనాథపల్లిలో డ్యూటీ నిర్వహిస్తున్న అతనికి శుక్రవారం మూర్చలు రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు.
పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. 48 ఏళ్ల రాజు స్వగ్రామం మెదక్ జిల్లా నారాయణఖేడ్ మండలం చాప్తఖడీం. 1993 బ్యాచ్కు చెందిన అతనికి కొంతకాలంగా మూర్చలు వస్తుండేవని మరో కానిస్టేబుల్ రవీందర్ తెలిపారు. రాజుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.