మూగబోయిన మైకులు, ఎక్కువ మంది అభ్యర్థులు ఇక్కడే: 'నా ఓటు'లో అన్నీ చూసుకోవచ్చు
హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసింది. పార్టీల మైకులు మూగబోయాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదలు, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్.. ఎందరో ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ తన సొంత నియోజకవర్గం గజ్వెల్లో, రేవంత్ రెడ్డి తన నియోజకవర్గం కొడంగల్లో ప్రచారం పూర్తి చేశారు.
ప్రజాకూటమి కోదాడలో ఎన్నికల ప్రచారం ముగించింది. నేతలు పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకున్నారు. చివరి నిమిషం వరకు ప్రచారం హోరాహోరీగా సాగింది. ఎల్లుండి (శుక్రవారం) ఉదయం పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచి మద్యం దుకాణాలు బంద్ చేస్తారు.
నిబంధనలు అతిక్రమిస్తే జైలు శిక్ష
సరిగ్గా ఐదు గంటలకు అన్ని పార్టీల మైకులు మూగపోయాయి. నేతల పరస్పర విమర్శలు ఆగిపోయాయి. నిబంధనలు అతిక్రమిస్తే రెండేళ్ల జైలు లేదా భారీ జరిమానా విధిస్తారు.
తెలంగాణ ఎన్నికల్లో 96వేల మంది పోలీసులు
తెలంగాణలో శుక్రవారం నాటి ఎన్నికలకు ఈసీ అన్నింటిని సిద్ధం చేస్తోంది. 96వేల మంది పోలీసులు సిద్ధంగా ఉన్నారు. కేంద్రబలగాలు 22వేలు. ఇతర రాష్ట్రాల నుంచి 20వేల మంది వచ్చారు. తెలంగాణ బలగాలు 54వేలు. 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. మావోయిస్టు ప్రభవిత ప్రాంతాల్లో గంట ముందే ప్రారంభమై, గంట ముందే ముగుస్తుంది.
తెలంగాణలో ఓటర్లు
తెలంగాణలో మొత్తం ఓటర్లు 2,80,64,684 మంది. ఇందులో పురుష ఓటర్లు 1,41,56,182 మంది. మహిళా ఓటర్లు 1,39,05,811 మంది. 2,691 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. సర్వీస్ ఓటర్లు 10,038. ఇందులో పురుషులు 9,756, స్త్రీలు 282.
బరిలో 1821 మంది అభ్యర్థులు, మల్కాజిగిరిలో ఎక్కువమంది
119 నియోజకవర్గాలలో 1821 మంది బరిలో ఉన్నారు. మల్కాజిగిరిలో అత్యధికంగా 42 మంది బరిలో ఉన్నారు. అత్యల్పంగా బాన్సువాడలో ఆరుగురు బరిలో నిలిచారు. తెలంగాణ వ్యాప్తంగా 32,815 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. భద్రాచలం నియోజకవర్గంలో అత్యల్ప పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.
కొత్తగా వీవీప్యాట్, నా ఓటు యాప్
ఈ ఎన్నికల్లో కొత్తగా వీవీప్యాట్లు ఏర్పాటు చేశారు. 55,329 ఈవీఎంలు, 42,751 వీవీప్యాట్లు సిద్ధం చేశారు. ఫిర్యాదుల కోసం 'సీ విజిల్' ఏర్పాటు చేశారు. వికలాంగుల కోసం 'వాదా' ఏర్పాటు చేశారు. ఓటర్, పోలింగ్, బూత్ సమాచారం కోసం 'నా ఓటు' యాప్ను అందుబాటులో ఉంచారు. ఎన్నికల భద్రతకు 279 కేంద్ర కంపెనీల బలగాలు వచ్చాయి. రాష్ట్ర భద్రతా బలగాలు 30వేల మంది. ఐదు రాష్ట్రాల నుంచి మరో 18వేల మందికి పైగా వచ్చారు.
హైదరాబాద్ నగర పరిధిలో ఇలా
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. నోడల్ అధికారులుగా 15 మంది ఏసీపీ ర్యాంక్ ఆఫీసర్లను వేశారు. హైదరాబాదులో 3911 పోలింగ్ స్టేషన్లు, 1574 పోలింగ్ లొకేషన్లు ఏర్పాటు చేశారు. 161 సమస్యాత్మక పోలింగ్ బూత్లు గుర్తించారు. ఎన్నికల కోసం 60 షాడో టీంలను ఏర్పాటు చేశారు. ఎన్నికల రోజు 518 చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తారు. పోలింగ్ బూత్లోకి సెల్ ఫోన్లను అనుమతించరు.
సైబరాబాద్ పరిధిలో 13 నియోజకవర్గాలు ఉన్నాయి. 2867 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 152 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. 2 ఓట్ల లెక్కింపు కేంద్రాలు, 53వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 21 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 26 చెక్ పోస్టులు ఏర్పాటు. 155 వెహికిల్ చెక్ పోస్టులు. 12 వేల మందితో సైబరాబాదులో భద్రత.
రాచకొండ పరిధిలో 13 నియోజకవర్గాలు ఉన్నాయి. 27.67 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కేంద్రాలు 3073. 517 సమస్యాత్మక కేంద్రాలు. 27 ఫ్లయింగ్ స్క్వాడ్లు. 27 పోలింగ్ పర్యవేక్షణ బృందాలు ఏర్పాటు చేశారు. 11 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. 2వేల మందితో భద్రత. రాచకొండ పరిధిలో 2 కౌంటింగ్ కేంద్రాలు, 59 వేల సీసీ కెమెరాలు, 3 మొబైల్ లైవ్ కెమెరాలు ఏర్పాటు చేశారు.