రైతుబంధు తాత్కాలిక పథకమే ... ఎల్లకాలం ఇచ్చేది కాదు..మరోసారి తేల్చిచెప్పిన పార్థసారథి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు బ్యాడ్ న్యూస్. రైతుల పంట పెట్టుబడి కోసం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకానికి బ్రేక్ పడే అవకాశం ఉంది. ఈ పథకం తాత్కాలికమేనని వ్యవసాయశాఖ స్పష్టంచేసింది. సాక్షాత్తు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి ప్రకటన చేయడం సర్వత్రా చర్చానీయాంశమైంది. రైతు సంక్షేమమే ప్రయారిటీ అని చెప్పి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ సర్కార్ రైతుబంధు పథకం తాత్కాలికమేనని సంకేతాలు ఇవ్వడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. రైతుబంధు పథకాన్ని కొనసాగించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి.
రైతుబంధు పథకం ఎప్పటికీ కొనసాగే అవకాశం లేదని మంగళవారం హైదరాబాద్ లో మీడియాకు చెప్పారు పార్థసారథి. ఇది రైతులకు ఉపశమనం కలిగించేందుకు తాత్కాలికంగా ప్రవేశపెట్టిన పథకం మాత్రమేనని తేల్చిచెప్పారు. రైతులకు ప్రభుత్వం పూర్థిస్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించేంత వరకు మాత్రమే ఈ పథకం కొనసాగుతుందని స్పష్టంచేశారు. రైతుబంధు పథకం రాజకీయపరమైన విధాన నిర్ణయం .. అయితే ఇది శాశ్వత పథకం కాదని ... రైతులకు మౌలిక సదుపాయాలు, సాగునీరు కల్పించేంత వరకు కొనసాగుతుందని తేల్చిచెప్పారు. అయితే ఇందుకోసం డెడ్ లైన్ పెట్టుకున్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. కానీ పార్థసారథి కామెంట్స్ తో రైతుల్లో మాత్రం ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదివరకు కూడా ఓసారి రైతుబంధు పథకం టెంపరరీ అని తెలిపారు పార్థసారథి. మరోసారి ఈ పథకం తాత్కాలికమేనని పార్థసారథి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ.4 వేలతో గతేడాది రైతుబంధు పథకాన్ని ప్రారంభించారు సీఎం కేసీఆర్. రెండు పంటల చెక్కులను రైతులకు అందజేశాక .. మళ్లీ అధికారంలోకి వస్తే ఎకరానికి రూ.5 వేలు ఇస్తామని ఎన్నికల ప్రచారసభలో క్యాంపెయిన్ చేశారు. కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలకు తోడు .. రైతుబంధు పథకంతో మళ్లీ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం కొలువుదీరి రెండునెలలు గడిచిందో లేదో .. ప్రతిష్టాత్మక రైతుబంధును నిలిపివేస్తామని వ్యవసాయశాఖ కార్యదర్శి వ్యాఖ్యానించడంతో అన్నదాత ఆందోళన చెందుతున్నాడు. ఎకరాకు ఇచ్చే రూ.5 వేల నగదుతో ఎరువులు, కూలీలు, ఇతర ఖర్చులు తీరుతున్నాయని ... అర్ధాంతరంగా పథకాన్ని నిలిపివేస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధును ఆదర్శంగా తీసుకొని ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో కేంద్రప్రభుత్వం కొత్త పథకం తీసుకొచ్చింది. ఈ మేరకు బడ్జెట్ లో రూ.20 వేల కోట్ల నిధులను కూడా కేటాయించారు. 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ.6 వేల నగదు అందజేస్తారు. అది కూడా రూ.2 వేల చొప్పున 3 సార్లు బ్యాంకు ఖాతాల్లో వేస్తారు. ఈ పథకంపై తెలంగాణ ప్రభుత్వం వెనకడుగు వేయాలని భావిస్తుంటే .. మరి దేశవ్యాప్తంగా మోదీ సర్కార్ అమలు చేస్తుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.