మార్గదర్శకాలు ఇవ్వలేం, ‘సెక్షన్ 8’ అమలు గవర్నరే చూసుకుంటారు: హోంశాఖ
న్యూఢిల్లీ: పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్లో గవర్నర్కు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 8ని అమలు చేయాలంటూ మార్గదర్శకాలు ఇవ్వాలన్న నిబంధన చట్టంలో లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హరిభాయ్ పరాతిభాయి చౌధరి స్పష్టం చేశారు.
తెలుగుదేశం లోకసభసభ్యుడు అవంతి శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు లోక్సభలో ఆయన ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని అన్ని సెక్షన్లను, ప్రత్యేకంగా సెక్షన్ 8ని అమలు చేయాలని కేంద్రం ఏమైనా గైడ్లైన్స్ విడుదల చేసిందా? అని అవంతి ప్రశ్నించారు.
ఇరు రాష్ట్రాల మధ్య సంఘర్షణను నివారించేందుకు, హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నంతకాలం చట్టంలోని ప్రతి సెక్షన్పైనా గైడ్లైన్స్ విడుదల చేశారా? అని ఆయన అడి గారు. దీనికి మంత్రి సమాధానం ఇస్తూ.. సెక్షన్ 8 అమలుకు మార్గదర్శకాలు ఇవ్వాలన్న నిబంధన చట్టంలో లేదన్నారు.
అయితే, ఇరు రాష్ట్రాల మధ్య సంఘర్షణను నివారించేందుకు ఏపీ, తెలంగాణ ప్రతినిధులతో హోంశాఖ తరచూ సమావేశాలు నిర్వహిస్తోందని, ఇలాంటి సమావేశం మే 30న ఒకసారి జరిగిందని బదులిచ్చారు.
కాగా, విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో శాంతిభద్రతల్ని కాపాడేందుకు ప్రత్యేక అధికారాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే కేంద్రం తీసుకున్న చర్యలేంటి? అంటూ భారతీయ జనతా పార్టీ ఎంపి హరిబాబు ప్రశ్నించారు. దీనికి కూడా హరిభాయ్ చౌధరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
ఉమ్మడి రాజధానిలో నివసించే ప్రజల ప్రాణాలు, స్వేచ్ఛ, ఆస్తుల భద్రతకు సంబంధించి ఉమ్మడి గవర్నర్కు విభజన చట్టం సెక్షన్ 8 ద్వారా ప్రత్యేక బాధ్యత కట్టబెట్టినట్లు వివరించారు. ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలు, అంతర్గత భద్రత, కీలక సంస్థల భద్రత, ప్రభుత్వ భవనాల నిర్వహణ, కేటాయింపు బాధ్యతలను గవర్నర్ నిర్వర్తించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
అధికారిక నోటిఫికేషన్లలో తెలంగాణ రాష్ట్రం పేరు చేర్చండి
అన్ని ప్రభుత్వ నోటిఫికేషన్లలో తెలంగాణ రాష్ట్రం పేరును ప్రస్తావించేలా కేంద్ర ప్రభుత్వంలోని అన్ని శాఖలు, రాష్ట్రాలకు సూచిస్తూ సర్క్యూలర్ జారీ చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి.. కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు టిఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ హోంమంత్రి రాజ్నాథ్కు లేఖ రాశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి సంవత్సరం గడిచినా.. ప్రభుత్వ రికార్డుల్లో ఆ విషయాన్ని జోడించలేదని తెలిపారు.