రద్దుకే మొగ్గు.. కెకెకు భంగపాటేనా?: ప్రభుత్వం వద్దకు ఫైల్.. కేసీఆర్ ఏం చేస్తారు?
కెకె కుటుంబానికి సంబంధించిన భూ రిజిస్ట్రేషన్లను రద్దు చేయడానికి రెవెన్యూ యంత్రాంగం సిద్దపడినట్లు' తెలుస్తోంది.
హైదరాబాద్: రంగారెడ్డి పరిధిలో వెలుగుచూసిన గోల్డ్ స్టోన్ ప్రసాద్ భూ అక్రమాల్లో టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు ఇరుక్కున సంగతి తెలిసిందే. ఇబ్రహీంపట్నం సమీపంలోని ప్రభుత్వ, అటవీ శాఖలకు చెందిన భూములను నకిలీ జీపీఏల ద్వారా రిజిస్టర్ చేసిన ఆ సంస్థ.. ఇందులో భాగంగానే కెకె ఫ్యామిలీకి 38ఎకరాలను విక్రయించింది.
తొలుత ఈ రిజిస్ట్రేషన్ చాలాకాలం పాటు పెండింగ్ లో ఉండగా.. సబ్ రిజిస్ట్రార్ మధుసూదన్ రెడ్డి స్థానంలో వచ్చిన ఇన్ చార్జీ ఖదీర్ వీటిని రిజిస్టర్ చేశారు. తాజాగా మియాపూర్ భూకుంభకోణంలో గోల్డ్ స్టోన్ ప్రసాద్ హస్తం వెలుగుచూడటంతో ఇబ్రహీంపట్నంలో భూకబ్జాల విషయం వెలుగులోకి వచ్చింది.
కబ్జా భూములను ఎలా కొనుగోలు చేశారన్న ప్రశ్నకు.. తాము అన్ని సరిచూశాకే కొనుగోలు చేశామంటున్నారు కెకె. హైకోర్టు సైతం గతంలో వీటిని ప్రభుత్వ భూములు కాదని నిర్దారించినట్లు చెప్పారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీల నుంచి దీనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో 'కెకె కుటుంబానికి సంబంధించిన భూ రిజిస్ట్రేషన్లను రద్దు చేయడానికి రెవెన్యూ యంత్రాంగం సిద్దపడినట్లు' తెలుస్తోంది. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా యంత్రాంగం ప్రాథమికంగా రద్దు చేయడానికే మొగ్గు చూపినట్లు సమాచారం.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ యంత్రాంగం నివేదిక పంపించగా.. రిజిస్ట్రేషన్ రద్దు అంశాన్ని అందులో పొందుపరిచారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే దీనిపై తదుపరి అడుగు వేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
భూముల రిజిస్ట్రేషన్ గనుక రద్దయినట్లైతే కెకెకు భంగపాటు తప్పదు. అధికార పార్టీలో ఉండి కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం ఆయన ఇబ్బందిగా భావించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.