నువ్వా, నేనా కాదు.. మనలో గెలిచేది ఎవరు?.. రంగారెడ్డి పరిషత్ పోరులో పెరిగిన అభ్యర్థులు
రంగారెడ్డి : జిల్లాలో పరిషత్ పోరు ఆసక్తికరంగా మారింది. తొలి విడతలో భాగంగా 93 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీగా అదృష్టం పరీక్షించుకోవడానికి చాలాచోట్ల అధిక సంఖ్యలో అభ్యర్థులు పోటీపడుతున్నారు. 18 చోట్ల మాత్రమే ఇద్దరు అభ్యర్థులు ఢీ అంటే ఢీ అంటున్నారు. ఇక మిగతా చోట్ల ఒక్కో స్థానానికి అత్యధికంగా ఆరు నుంచి ఏడుగురు పోటీ పడుతుండటం గమనార్హం. ఎన్నడూలేనంతగా అభ్యర్థుల మధ్య పోటీ పెరగడం జిల్లాలో చర్చానీయాంశమైంది.
ఇద్దరిని మించి పోటీ
రంగారెడ్డి జిల్లాలో ఈసారి పరిషత్ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా పెద్దసంఖ్యలో అభ్యర్థులు పోటీపడుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆశావహులు ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో పరిషత్ ఎన్నికలంటే ఏ ఇద్దరు, ముగ్గురో పోటీపడేవారు. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది.
జిల్లాలో రాజకీయ చైతన్యం పెరగడంతో యువత పెద్దఎత్తున ప్రజాప్రతినిధులుగా చలామణి అయ్యేందుకు ఉవ్విళ్లూరుతున్నట్లు కనిపిస్తోంది. చిన్న చిన్న పదవులకు సైతం పోటీ భారీగా నెలకొంటున్న పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఆ క్రమంలో అందివచ్చిన అవకాశం ఉపయోగించుకోవాలని పరిషత్ ఎన్నికలను టార్గెట్ చేశారు కొందరు. జడ్పీటీసీ, ఎంపీటీసీలుగా తమ అదృష్టం పరీక్షించుకునేందుకు పోటీకి సై అంటున్నారు.
కేంద్రంలో ఈసారి అధికార పీఠం ఎవరిది?.. అక్కడ ఏ పార్టీ గెలిస్తే వాళ్లదేనా కుర్చీ?
పోటీకి సై..
శంకర్పల్లి మండలంలో చూసినట్లయితే తొలివిడతలో 13 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా సంకేపల్లి ఏకగ్రీవమైంది. గాజులగూడ స్థానానికి ఇద్దరు మాత్రమే బరిలో నిలిచారు. నువ్వా నేనా అనే రీతిలో గెలుపు కోసం ఆరాటపడుతున్నారు. అయితే సంకేపల్లి, గాజులగూడ రెండు స్థానాలు మినహాయిస్తే మిగతా 11 చోట్ల ఒక్కో స్థానానికి దాదాపు నలుగురు పోటీపడుతున్నారు.
మంచాల మండలంలో కూడా తొలివిడత ఎలక్షన్లలో మొత్తం 13 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అన్నీ స్థానాల్లోనూ కనీసం ముగ్గురి నుంచి అత్యధికంగా ఐదుగురు అభ్యర్థులు సై అంటే సై అంటున్నారు.
ఇండిపెండెంట్ల జోరు.. చాలాచోట్ల నామినేషన్లు
రెండో విడత ఎన్నికల్లో భాగంగా 8 జెడ్పీటీసీ, 89 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే 89 ఎంపీటీసీ స్థానాలకు గాను 17 చోట్ల మాత్రమే ఇద్దరు పోటీ పడుతున్నారు. మిగతా 72 స్థానాల్లో దాదాపు ఆరుగురు అభ్యర్థుల వరకు బరిలో నిల్చోవడం గమనార్హం.
అసెంబ్లీ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల విజయంతో జోరుమీదున్న టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్లు ఆశిస్తున్నవారి సంఖ్య భారీగా పెరిగింది. అటు కాంగ్రెస్ లో కూడా పోటీ అధికంగానే ఉంది. ఈ రెండు పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులుగా పోటీ చేయడానికి చాలామంది ఆసక్తి చూపిస్తుండటంతో పరిషత్ ఎన్నికల పర్వం హాట్ టాపికయింది.