గ్రూప్ -1 ఫలితాలు ఇంకా సందేహస్పదమే! టీఎస్పీఎస్సీ పనితీరుపై డౌట్లు
టీఎస్పీఎస్సీ ప్రకటించిన గ్రూప్ మెయిన్స్ ఫలితాల్లో ఏదో మతలబు ఉన్నదని అభ్యర్థులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్: తెలంగాణలో లక్షకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీ ప్రక్రియలో భాగంగా ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న గ్రూప్ - 1 నియామకాలకు నిర్వహించిన మెయిన్స్ రాత పరీక్షలు, ఇంటర్వ్యూ ఫలితాలు కలిపి ప్రకటించడం అనుమానాస్పదంగా ఉన్నది. గ్రూప్ - 1 ఫలితాలపై ఇంకా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. గ్రూప్ -1 మెయిన్స్ రాతపరీక్షలు, ఇంటర్వ్యూ మార్కులు వేర్వేరుగా మార్కులు ఇవ్వక పోవడం సందేహాలకు తావిస్తున్నది.
టీఎస్పీఎస్సీ పారదర్శకతపై అభ్యర్థుల్లో సందేహాలు తొలగలేదు. ఇంటర్వ్యూ మార్కులను విడిగా ఇవ్వకపోవడంలోనే మతలబు దాగి ఉందని గ్రూప్ - 1 అభ్యర్థుల్లో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రెండు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) 2011 గ్రూప్ -1 సవరణ ఫలితాలను ప్రకటించిన విషయం తెలిసిందే.
మెయిన్స్, ఇంటర్వ్యూ మార్కులు కలిపి ప్రకటించిన టీఎస్పీఎస్సీ
2008 - 09లో గ్రూప్ -1 ఫలితాలను ఏపీపీఎస్సీ మెయిన్స్లో ఉన్న ఐదు పేపర్లతోపాటు ఇంటర్వ్యూ మార్కులను విడివిడిగా వెల్లడించింది. అభ్యర్థుల్లో సందేహాలకు తావులేకుండా ప్రకటించింది. కానీ టీఎస్పీఎస్సీ మాత్రం గ్రూప్-1 మెయిన్స్ రాతపరీక్షలు, ఇంటర్వ్యూ మార్కుల మొత్తాన్ని కలిపి వెల్లడించడం పట్ల అనుమానాలు రేకెత్తుతున్నాయి.
టీఎస్పీఎస్సీ పారదర్శకతపై అభ్యర్థుల్లో సందేహాలు వ్యక్తం
గ్రూప్ - 1 మెయిన్స్ రాతపరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అభ్యర్థులు, ఇంటర్య్వూలో కావాలనే తక్కువ మార్కులు పొందచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెయిన్స్ రాతపరీక్షలో తక్కువ మార్కులు పొంది ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు సాధించి ఉద్యోగాలకు ఎంపిక అయ్యారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీఎస్పీఎస్సీ పాటిస్తున్న పారదర్శకతపైనే అభ్యర్థుల నుంచి సందేహాలు రావడం గమనార్హం.
టీఎస్పీఎస్సీ సందేహాలు నివృత్తి చేయాలన్న డిమాండ్
గ్రూప్-1 మెయిన్స్ రాతపరీక్షలో సాధించిన మార్కులను పేపర్ల వారీగా, ఇంటర్వ్యూ మార్కులను విడివిడిగా ప్రకటించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే అభ్యర్థుల్లో ఉన్న సందేహాలు నివృత్తి అవుతాయని వాపోతున్నారు. అనుమానాలకు తావు లేకుండా టీఎస్పీఎస్సీ వ్యవహరించాలని కోరుతున్నారు. గ్రూప్ - 1 మెయిన్స్, ఇంటర్వ్యూ మార్కుల వివరాలు వేర్వేరుగా ఇవ్వడానికి టీఎస్పీఎస్సీ ఎందుకు వెనకడుగు వేస్తుందో అర్థం కావడం లేదని అభ్యర్థులు అభిప్రాయ పడుతున్నారు.
పది మంది అభ్యర్థుల జాతకాలు తారుమారు
టీఎస్పీఎస్సీ రెండు రోజుల క్రితం వెల్లడించిన గ్రూప్ -1 ఫలితాల్లో 128 పోస్టులకు 122 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. ఇందులో 70 మంది అభ్యర్థుల జీవితాలు తారుమారయ్యాయి. పది మంది ఉద్యోగాలు కోల్పోయారు. కొత్తగా పది మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మెరిట్లో ఉన్నా ఎంపీడీవో పోస్టులకు ఆప్షన్ ఇవ్వకపోవడం వల్ల ఇద్దరు ఉద్యోగాలకు ఎంపిక కాలేదు. ఇక 48 మంది అభ్యర్థులకు గతం కన్నా మెరుగైన పోస్టింగులు దక్కాయి. టాప్లో ఉన్నా ప్రాధాన్యం లేని పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు కేటాయించిన పోస్టుల్లోనూ తాజాగా మార్పు జరిగింది.
సాంకేతిక లోపంతోనే మార్కులు తారుమారు?
వీటితోపాటు గ్రూప్-1 ఫలితాల్లో ఇంకేం మార్పులు జరిగాయోనని అభ్యర్థుల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. మెయిన్స్ రాత పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కులు ఒకరికి బదులు మరొకరికి పడొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్వ్యూలో సాధించిన మార్కులూ ఒకరికి ఇంకొకరికి పొరపాటున వెళ్లి ఉండొచ్చని కొందరు చెప్తున్నారు. సీజీజీలో కంప్యూటర్ ద్వారా సాంకేతిక లోపం తలెత్తడంతో మార్కులు తారుమారు కావడమూ జరిగి ఉండొచ్చని అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మార్కుల్లో తేడాతో జాతకాలు తారుమారు?
పోస్టుల ప్రాధాన్యతలే కాకుండా మార్కులనూ ప్రత్యేకంగా స్వతంత్ర కమిటీని నియమించి పరిశీలించాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఏండ్ల తరబడి సీరియస్గా చదివిన వారికి పోస్టులు దక్కలేదని, సాదాసీదాగా చదివిన కొందరికి ఉద్యోగాలు వచ్చాయని మరికొందరు వాపోతున్నారు. మార్కులు తారుమారు కావడమే ఇందుకు కారణమై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని అభ్యర్థుల అభ్యర్థనలు
ఇంకోవైపు గతనెల 28న ప్రకటించిన గ్రూప్ - 1 ఫలితాల్లో ఎంపికై తాజాగా ఉద్యోగాలు కోల్పోయిన పది మందిలో కొందరు కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్టు సమాచారం. మెయిన్స్ పేపర్ల వారీగా, ఇంటర్వ్యూ మార్కులు వేర్వేరుగా ప్రకటిస్తే ఇలాంటి అనుమానాలకూ తావు ఉండబోదని అభ్యర్థులు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని స్వతంత్ర కమిటీని నియమించి పూర్తిస్థాయిలో పరిశీలించాలని కోరుతున్నారు.