ఔటర్ రక్తసిక్తం, ముగ్గురి మృతి: ఉద్యోగం పేరుతో వ్యభిచారంలోకి, అరెస్ట్
హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డులో మరో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, అయిదుగురు గాయపడ్డారు. శనివారం అర్ధరాత్రి ఓ కారు అదుపు తప్పి ఔటర్పై డివైడర్ను ఢీకొట్టిన ప్రమాదంలో కారులోనే ముగ్గురు మృతి చెందారు. అయిదుగురికి తీవ్రగాయాలయ్యాయి.
వీరిలో ఓ యువతి, మూడేళ్ల బాలుడు పరిస్థితి విషమంగా ఉంది. గుంటూరుకు చెందిన గీతారాణి(40), వెంకటేశ్వర్లు దంపతులు గత పదేళ్లుగా శేరిలింగంపల్లిలో ఉంటున్నారు. గీతారాణి సమీప బంధువు, స్థానికంగా ఉండే విజయ్ కుమార్ (28) బ్యాంకు ఉద్యోగి.
ప్రకాశం జిల్లా అద్దంకిలో ఉంటున్న గీతారాణి కుమార్తె ఇంట్లో శుభకార్యం ఉండడంతో.. గీతారాణి, విజయ్కుమార్, గీతారాణి అన్న కుమార్తె, మెదక్ జిల్లా మాచవరంలో ఉండే తనూజ(30), వారి బంధువైన బీటెక్ విద్యార్థిని పూజ(18)లు మూడు రోజుల క్రితం కారులో అద్దంకికి వెళ్లారు.
విజయ్ కుమార్ తన కారులో తానే డ్రైవింగ్ చేస్తూ వీరిని తీసుకెళ్లాడు. శనివారం హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో కారు శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి వస్తోంది. సనా గార్డెన్ మలుపు వద్ద కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి అవతలివైపునున్న మరో కారును ఢీకొంది.
ప్రమాదంలో గీతారాణి, విజయ్ కుమార్, తనూజలు మృతి చెందారు. పూజకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స పొందుతోంది. ప్రమాదానికి గురైన మరో కారులో ఉన్న టోలిచౌకీకి చెందిన షేక్షఫీ, సుల్తానా, జాఫర్, ఇఫ్తెకార్, మూడేళ్ల చిన్నారి సొహైల్లకు తీవ్రగాయాలయ్యాయి.
యువతులకు ఉద్యోగాలంటూ వ్యభిచారకూపంలోకి..
ఉద్యోగాలు ఇప్పిస్తామని పేద యువతులను మభ్యపెట్టి వారితో వ్యభిచారం చేయించేందుకు ప్రయత్నిస్తున్న మహిళను ఆదివారం మల్కాజిగిరి పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడకు చెందిన లక్ష్మీ గతంలో మల్కాజిగిరి, నేరేడుమెట్, కుషాయిగూడ పోలీసు స్టేషన్ల పరిధిలో వ్యవభిచార కేంద్రాల నిర్వాహకురాలిగా అరెస్టయింది.
జైలుకెళ్లి వచ్చినా ఆమెలో మార్పు రాలేదు. ఇటీవల మల్కాజిగిరి పోలీసు స్టేషన్ పరిధిలో అరెస్టు అయి జైలు నుంచి బయటకు వచ్చింది. తిరిగి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు యువతులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని తీసుకొచ్చింది. వారితో బలవంతంగా వ్యభిచారం చేయించేందుకు ప్రయత్నించింది. పోలీసులు తనిఖీలు నిర్వహించి ఆమెను అరెస్టు చేశారు. ఇద్దరు యువతులను రెస్క్యూ హోంకు తరలించారు.