తృటిలో తప్పిన ప్రమాదం: శంషాబాద్ విమానాశ్రయంలో కారు దగ్ధం
శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఈరోజు ఉదయం కారు దగ్ధమైంది. ఓ వ్యక్తి విమానాశ్రయానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. దీంతో ఆ వ్యక్తి వెంటనే కారు దిగి దూరంగా వెళ్లాడు.
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం వద్ద శుక్రవారం ఉదయం ఓ కారు దగ్ధమైంది. ఓ వ్యక్తి విమానాశ్రయానికి వచ్చి తిరిగి వెళ్తుండగా విమానాశ్రయం ఆవరణలోనే ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి.
గమనించిన ఆ వ్యక్తి వెంటనే కారు దిగి దూరంగా వెళ్లాడు. దీంతో అతనికి ఎలాంటి గాయాలు కాలేదు. ఘటనపై సమాచారం అందుకున్న విమానాశ్రయ అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు.
పాఠశాల బస్సు బోల్తా: విద్యార్థులకు గాయాలు
జడ్చర్ల: పాఠశాల విద్యార్థులను తీసుకెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం పెద్దఆదిరాల గ్రామ పరిధిలోని ఎక్వాయపల్లిలో చోటుచేసుకుంది. తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన అక్షర ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు ఎక్వాయపల్లికి చెందిన పిల్లలను తీసుకుని వెళ్తుండగా స్టీరింగ్ రాడ్ విరిగిపోయింది. దీంతో ఒక్కసారిగా బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి వారిని జడ్చర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పాఠశాల యాజమాన్యం ఫిట్నెస్ లేని బస్సును నడపడం వల్లనే ప్రమాదం జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇది ఇలాఉండగా, కరీంనగర్ జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మేడ్చల్ జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.