మహారాష్ట్ర యువతిపై రేప్: మహిళల మంగళసూత్రాలే టార్గెట్
గతంలో మరదలిపై అత్యాచారం చేసి జైలు శిక్ష అనుభవించిన హైదరాబాదువాసి మహిళల మంగళసూత్రాలనే టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతూ వస్తున్నాడు.
హైదరాబాద్: దృష్టి మరల్చి మహిళల మంగళసూత్రాలను కాజేసే ఘరానా దొంగను పోలీసులు పట్టుకున్నారు. మంగళసూత్రాలను ఎత్తుకెళ్లడానికి మధ్యతరగతివారు నివసంచే ప్రాంతాలను ఎంచుకుంటాడు. హైదరారబాదులోని యాకుత్పురాకు చెందిన అఫ్తాబ్ అహ్మద్ షేక్ వృత్తిరీత్యా డ్రైవర్. కొన్నేళ్ల క్రితం మహారాష్ట్రకు చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు.
మహారాష్ట్రలోని సియోన్లో గల అత్తారింటికి వెళ్లిన అతను 2010లో మరదలిపై అత్యాచారం చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పన్వేల్ పోలీసులు అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపించారు. న్యాయస్థానం అతనికి ఐదున్నర ఏళ్ల జైలు శిక్ష, విధించింది. కొల్హాపూర్ జైలులో శిక్ష అనుభవించాడు.
నిరుడు సెప్టెంబర్లో జైలు నుంచి విడుదలై నగరానికి వచ్చాడు. అప్పటి కొత్త పద్ధతిలో గిఫ్ట్ల పేరుతో మహిళలను మోసం చేయడం ప్రారంభించాడు. అఫ్తాబ్ వనస్థలిపురం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని బురిడీ కొట్టించి అతని మ్యాస్ట్రో వాహనాన్ని కొట్టేశాడు. దానిపైన తిరుగుతూ వివిధ ప్రాంతాల్లో నిర్మానుష్య ప్రదేశాల్లో నడుస్తున్న మహిళలను, చిన్నపాటి దుకాణాల్లో ఉన్న పురుషులను ఎంపిక చేసుకుని, వారి వద్దకు వెళ్లి ఏ సర్వీసు ప్రొవైడర్ వాడుతున్నారో తెలుసుకునే వాడు.
'మీ మొబైల్ నంబరుకు రీఛార్జి చేసుకున్నపుడు లక్కీ డ్రా తీసామని, మీకు బహుమతి వచ్చిందని చెప్తాడు. ఆ వ్యక్తి రీఛార్జి కూపన్ ఇస్తే స్కూటర్, ఫ్రిజ్, టీవీ ఇలా వివిధ వస్తువులు గిఫ్ట్గా ఇస్తామని చెబుతాడు. కూపన్ను అప్పుడే పడేశామని మహిళ అంటే గతంలో బంగారం కొన్న పాత రసీదున్నా సరిపోతుందని అంటాడు, అదికూడా లేదంటే దగ్గర్లోని దుకాణంలో బంగారం కొన్నట్టు రసీదు ఇప్పిస్తానంటూ తనతో ఆమెను తీసుకెళ్తాడు. మార్గమధ్యంలో మంగళసూత్రాన్ని తీసుకుంటాడు. కొద్దిదూరంలో ఆమెను నించోబెట్టి దుకాణంలోకి వెళ్లి యజమానితో మాట్లాడినట్టు నటించి ఆమె దృష్టి మళ్లించి పరారవుతున్నాడు..
ఆరునెలల వ్యవధిలో 10చోట్ల మంగళసూత్రాలు కొట్టేశాడని పోలీసులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా అఫ్తాబ్ను మంగళవారం అరెస్ట్చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించామని చెప్పారు.