కాలిన కారు (ఫొటోలు): బాలికపై లైంగిక వేధింపులు
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మాదాపూర్లో ఓ కారులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఈ సంఘటన మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారంనాడు చోటు చేసుకుంది. శుక్రవారంనాడు మాదాపూర్లోని రహేజా ఐటి పార్కు సమీపంలో ఎపి 23టివి0568 నంబరు గల ఇండికా కారు ఇంజన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
దాంతో డ్రైవర్ ఇంజన్ ఆఫ్ చేసి మంటలను చల్లార్చాడు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం కూడా సంభవించలేదు. కాగా, సంఘటనకు సంబంధించి మాదాపూర్ పోలీసు స్టేషన్లో ఎటువంటి ఫిర్యాదు కూడా చేయలేదు.
ఖమ్మం జిల్లాలో కూలీ పనులకు వెళ్లే గిరిజన బాలికను ఆటో డ్రైవర్ తరచూ లైంగికంగా వేధింపులకు గురిచేస్తుండటంతో గురువారం ఆ బాలిక పురుగు మందు తాగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కందిమళ్ల వారి బంజర్ గ్రామానికి చెందిన చింతల సరిత (16) కూలీ పనులకు వెళ్తుంది.
తోటి కూలీలతో కలిసి ఆటోలో వెళ్తున్నప్పుడు అదే గ్రామానికి చెందిన బత్తుల మురళి అనే ఆటోడ్రైవర్తో పరిచయం ఏర్పడింది. అతడు కొంతకాలంగా లైంగికంగా వేధింపులకు గురిచేస్తుండటంతో గురువారం బాలిక ఇంటివద్ద పురుగుల మందు తాగింది. శుక్రవారం కృష్ణాజిల్లా తిరువూరు ఆసుపత్రిలో సరిత చికిత్స పొందుతూ మృతి చెందింది.