హైదరాబాద్ డిప్యూటీ మేయర్కు కరోనా పాజిటివ్..? తప్పుడు వార్త రాసిన ఇద్దరు రిపోర్టర్లపై కేసు
కరోనా వైరస్ గురించిన సమాచారం గురించి ఒక్కటికి రెండుసార్లు నిర్ధారించుకున్న తర్వాత వార్తలు రాయాలని తెలంగాణ ప్రభుత్వం పదేపదే చెప్పింది. తప్పుడు వార్తలు రాస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. కానీ ఇద్దరు మీడియా ప్రతినిధులు వినిపించుకోలేదు. ఏకంగా బల్దియా డిప్యూటీ మేయర్ సహా మరో ఇద్దరికీ కరోనా పాజిటివ్ వచ్చిందని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీంతో డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ సీరియస్గా స్పందించారు. సదరు రిపోర్టర్లపై కేసులు పెట్టారు.
Recommended Video
శ్రీకాళహస్తి గర్భగుడి వరకు పాకిన కరోనా: అర్చకుడికి పాజిటివ్: రాహు, కేతువు కూడా ప్రవేశించని చోట
డిప్యూటీ సహా ఇద్దరికీ పాజిటివ్
బాబా ఫసీయుద్దీన్ సహా మరో ఇద్దరు కార్పొరేటర్లకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరో 23 మంది కార్పొరేటర్లకు పరీక్షలు చేశామని.. త్వరలో ఫలితం వస్తుందని పేర్కొన్నారు. ఈ విషయం బాబా ఫసీయుద్దీన్కు కూడా చేరింది. వెంటనే హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు వార్త రాసిన ఇద్దరిపై హైదరాబాద్ ఏసీపీకి కంప్లైంట్ చేశారు. దీనిని ఏసీపీ కేవీఎం ప్రసాద్ ధృవీకరించారు. డిప్యూటీ మేయర్ ఫిర్యాదు ఆధారంగా తమ దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
వీరే ఆ ఇద్దరు
టీఎన్సీ న్యూస్కి చెందిన మహ్మద్ ఇమ్రాన్ అనే క్రైమ్ రిపోర్టర్, డెక్కన్ టుడేకు చెందిన మరోకరు తప్పుడు వార్తను ప్రచారం చేశారని బాబా ఫసీయుద్దీన్ పేర్కొన్నారు. కానీ తర్వాత డెక్కన్ టుడే తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది. సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారాన్ని విశ్వసించొద్దు, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ ఆరోగ్యంగా ఉన్నారు. ఆయనకు ఎలాటి వైరస్ సోకలేదు అని తమ ఫేస్ బుక్ ఫేజీలో రాసుకొచ్చింది.
మరో కేసు
ఇద్దరు రిపోర్టర్లపై కేసు నమోదు చేశామని డీసీపీ ప్రసాద్ తెలిపారు. ఎఫ్ఐఆర్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీంతోపాటు ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యులు, నర్సులకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందనే పుకార్లు జరిగాయి. ఆ అంశంపై కూడా కేసు నమోదు చేశామమని తెలిపారు. బాబా ఫసీయుద్దీన్ 2016లో బోరబండ వార్డు నుంచి కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం హైదరాబాద్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.