మహిళ చేయి పట్టి లాగాడు: ఓటుకు నోటు సెబాస్టియన్పై కేసు
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో నిందితుడు సెబాస్టియన్ పైన ఆదివారం నాడు ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. ఓ మహిళను వేధించిన కేసులో పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
మీడియాలో వస్తున్న వార్తల మేరకు.. ఏజీ కాలనీ సమీపంలోని వికాస్పురి కాలనీలో ఫిలిప్స్ అనే వ్యక్తికి చెందిన ఇంట్లో సెబాస్టియన్ గత పద్నాలుగేళ్లుగా ఉంటున్నాడు. ఇంటి యజమానికి సెబాస్టియన్కు మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది.
ఈ నేపథ్యంలో సెబాస్టియన్ శనివారం తాను ఉంటున్న ఇంటికి మరమ్మతులు ప్రారంభించాడు. విషయం తెలుసుకున్న ఇంటి ఓనర్ భార్య విజయ తమకు సమాచారం లేకుండా పనులు ఎలా చేస్తున్నారని అడిగారు.
దీంతో సెబాస్టియన్ ఆమె చేతిలో ఉన్న సెల్ఫోన్ లాక్కోవడంతో పాటు చేయిపట్టి లాగి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలు శనివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.