ఎన్నికల కోడ్: ప్రలోభపెట్టిన మాజీ ఎమ్మెల్యే రవీందర్పై కేసు, టీఆర్ఎస్ అభ్యర్థికి చేదు అనుభవం
హైదరాబాద్: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీంద్రరెడ్డి చిక్కుల్లో పడ్డారు. ఆయనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. తనకు ఓటేస్తే రూ.5లక్షల ఇస్తానంటూ మార్కల్లో డ్వాక్వా మహిళలను రవీంద్రరెడ్డి ప్రలోభపెట్టారు.
కాగా, ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఎన్నికల సంఘం సీరియస్గా తీసుకుంది. మాజీ ఎమ్మెల్యేపై రవీంద్ర రెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఈసీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు తహసీల్దార్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రవీంద్ర రెడ్డిపై కేసు నమోదు చేశారు. కామారెడ్డి కలెక్టర్ సత్యనారాయణ ఈ విషయంపై విచారణ జరుపుతున్నారు.
టీఆర్ఎస్ అభ్యర్థి రాథోడ్కు చేదు అనుభవం
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి రాథోడ్ బాపురావుకు ప్రజల నుంచి నిరసన సెగ తగిలింది. తలమడుగు మండలం కుచులాపూర్లో ప్రచారానికి వెళ్లిన ఆయనను గ్రామస్తులు తమ సమస్యలపై నిలదీశారు. కొబ్బరికాయలు కొట్టుడే తప్ప.. అభివృద్ధి చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన బాపురావు బోథ్ నియోజకవర్గంలో 19 చెరువులు మంజూరు చేయించానని బాపురావు తెలిపారు.
జనవరిలో చెరువు పనులు చేపడతారని రాథోడ్ చెప్పారు. బాపురావు వివరణతో సంతృప్తి చెందని గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. దీంతో కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో ఓ యువకుడు తమ గ్రామానికి చెరువు మంజూరు చేయిస్తే మీ విగ్రహం ఏర్పాటు చేస్తామని అన్నారు. అయితే, తాను బెదిరింపులకు భయపడనని, ప్రచారానికి మరోసారి కుచులాపూర్ రానంటే అక్కడ్నుంచి వెళ్లిపోయారు బాపురావు.