వైరా ఎమ్మెల్యేపై కేసు నమోదు: ఏపీ కల్తీమద్యం ఘటనతో 'టీ' ఎక్సైజ్ మంత్రి అలర్ట్
హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో అధికార పార్టీకి చెందిన వైరా ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్పై మంగళవారం రాత్రి కేసు నమోదైంది. కొణిజర్ల-2 ఎంపీటీసీ నాగలక్ష్మి భర్త సత్యనారాయణ ఫిర్యాదు చేయడంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటరును ప్రలోభ పెట్టేందుకు పలుకుబడిని ఉపయోగించిన అంశంపై 171 (ఎఫ్), టీఆర్ఎస్ పార్టీలో చేరాలంటూ బెదిరించినందుకు 506 సెక్షన్ల కింద ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసినట్లు సీఐ చేరాలు తెలిపారు.
ఈ నెల ఒకటో తేదీన కొణిజర్ల-2 ఎంపీటీసీ భర్తనైన నన్ను టీఆర్ఎస్లోకి చేరాలంటూ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ బెదిరించి, దూషించారంటూ ఎంపీటీసీ భర్త సత్యనారాయణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఖమ్మం మూడో అదనపు ప్రథమశ్రేణి న్యాయమూర్తి సీహెచ్ పంచాక్షరి ఆదేశాల మేరకు వైరా సీఐ చేరాలు ఆధ్వర్యంలో కొణిజర్ల పోలీసులు మంగళవారం రాత్రి ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు.
ఏపీ కల్తీమద్యం ఘటనతో 'టీ' ఎక్సైజ్ మంత్రి అప్రమత్తం
బెజవాడలోని కృష్ణలంక స్వర్ణబార్లో కల్తీ మద్యం సేవించి ఐదుగురు వ్యక్తులు దుర్మరణం పాలైన నేపథ్యంలో తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలో ఎక్కడైనా కల్తీమద్యం కేసులు వచ్చినా, ఎవరైనా చనిపోయినా లేదా అస్వస్థతకు గురైన ఎక్సైజ్ అధికారులే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
మంగళవారం నాడు ఎక్సైజ్ అధికారులతో సమావేశం నిర్వహించిన మంత్రి పద్మారావు ఈ మేరకు హెచ్చరించారు. కల్తీ మద్యం ఘటనలు జరిగితే స్టేషన్ హౌస్ ఆఫీసర్ని సస్పెండ్ చేస్తామని స్పష్టం చేశారు. కల్తీమద్యం ఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ ఉండాలని, ఎలాంటి విషాదం చోటు చేసుకోకుండా చూడాలని అధికారులకు సూచించారు.