ఎన్ని కేసులైనా పెట్టుకోండి.. బీజేపీని ఆపలేరు: కేసీఆర్కు తేజస్వి సూర్య కౌంటర్
బెంగళూరు/హైదరాబాద్: తెలంగాణలో తనపై కేసులు నమోదు చేయడంపై బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య స్పందించారు. ఎన్ని కేసులు పెట్టినా బీజేపీని ఆపలేరని స్పష్టం చేశారు. ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేసిన ఆయన.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన సభలో పాల్గొని ప్రసంగించారు.
అయితే, అనుమతి లేకుండా సభ నిర్వహించారంటూ తేజస్వి సూర్యపై హైదరాబాద్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన తేజస్వి సూర్య.. కేసీఆర్ సర్కారుపై సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
'సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు. నాపై ఎన్ని కేసులు కావాలంటే అన్ని కేసులు పెట్టుకోండి. ఇలా చేసి బీజేపీని ఆపలేరు. ఎన్ని కేసులు పెడితే బీజేపీ అంత బలంగా తయారవుతుంది' అని ట్విట్టర్లో పేర్కొన్నారు తేజస్వి సూర్య.
ఇది ఇలావుండగా, తేజస్వి సూర్యపై కేసు నమోదు చేయడంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. యువత తరపున ప్రశ్నించిన సూర్యను అడ్డుకోవాలనుకోవడం కక్ష సాధింపే అవుతుందని అన్నారు. అరెస్టులు, కేసులతో బీజేపీని అడ్డుకోవాలనుకోవడం అవివేకమని అన్నారు. ఈ మేరకు సంజయ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు యువత సిద్ధంగా ఉందని అన్నారు బండి సంజయ్.
కాగా, గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే పలువురు బీజేపీ బడా నేతలు పాల్గొనగా.. మరికొందరు కూడా ప్రచారంలో పాల్గొననున్నారు. బీజేపీ మేనిఫెస్టోను మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక నవంబర్ 27న ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, 28న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఎన్నికల ప్రచారం చివరి రోజు అయిన నవంబర్ 29న కేంద్ర హోంమంత్రి అమిత్ షా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించనున్నారు. డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగనుండగా,డిసెంబర్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.