హుజూర్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డిపై కేసు నమోదు .. ఆ పని చేసినందుకే
తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం రేపు తేలిపోతుంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ విజయకేతనం ఎగురవేసింది, ఏ అభ్యర్థి ఎమ్మెల్యేగా సత్తా చాటుతారో రేపు తేలిపోనుంది. ఇక ఇదే సమయంలో హుజూర్ నగర్ ఎన్నికల బరిలో టిఆర్ఎస్ పార్టీ నుండి పోటీచేసిన శానంపూడి సైదిరెడ్డి పై కేసు నమోదైంది. ఇది టీఆర్ఎస్ పార్టీ శ్రేణులను షాక్ కు గురి చేసింది.
హుజూర్ నగర్ ఉప ఎన్నిక పోలింగ్ రోజున టిఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గరిడేపల్లి మండలం కల్మలచెరువు పోలింగ్ బూత్ దగ్గర చేసిన పనికి ఆయనపై కేసు నమోదు చేశారు అధికారులు. స్థానిక నేతలతో కలిసి అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి పోలింగ్ బూత్ లో కి వెళ్లడానికి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో నిబంధనల ప్రకారం నడుచుకోవాలని ఆయనకు సూచించిన ఎస్సై రాఘవేందర్ రెడ్డి ఆయనను లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. దీంతో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సైదిరెడ్డి ఎస్సై కు వార్నింగ్ ఇచ్చారు.
సదరు ఎస్సై పై ఆగ్రహం వ్యక్తం చేసిన శానంపూడి సైదిరెడ్డి ఎక్కువ తక్కువ మాట్లాడకు.. ఓవరాక్షన్ వద్దు.. ఏం నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా? బయటోడు బయటోడు అంటావ్..? తగ్గు కొద్దిగా అంటూ చాలా ఘాటుగా విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐపై మండిపడ్డారు. ఇక ఈ వీడియో బయటకు రావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు ఆయనపై ఫిర్యాదు కూడా చేశారు.
దీంతో శానంపూడి సైదిరెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఎస్సై పై దురుసుగా ప్రవర్తించిన శానంపూడి సైదిరెడ్డి అధికార పార్టీ అభ్యర్థి కావడంతోనే ఈ విధంగా దౌర్జన్యానికి పాల్పడ్డారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇక దీంతో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి పై సెక్షన్ 356, 504 కింద కేసు నమోదు చేశారు.