గంజాయి కుట్ర కేసు: మాజీ మంత్రి శ్రీధర్ బాబు అనుచరుల అరెస్ట్
హైదరాబాద్: కిషన్ రెడ్డి అనే టీఆర్ఎస్ నేతను కుట్ర పూరితంగా గంజాయి కేసులో ఇరికించేందుకు ప్రయత్నించిన సుదర్శన్ రెడ్డి, బార్గవ్ అనే ఇద్దరు వ్యక్తులను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి నాంపల్లి కోర్టు సోమవారం 14రోజుల రిమాండ్ విధించింది.
కాగా, కిషన్ రెడ్డిని ఉద్దేశపూర్వకంగా గంజాయి కేసులో ఇరికించేందుకు మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రయత్నించారనే ఆరోపణలున్న నేపథ్యంలో ఆయనపై కూడా కేసు నమోదు చేశారు. సుదర్శన్, భార్గవ్లు శ్రీధర్ బాబు అనుచరులే కావడం గమనార్హం.
గంజాయి కేసులో సుదర్శన్కు శ్రీధర్ బాబు సహకరించినట్లు వారి ఫోన్ సంభాషణల ద్వారా పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. కాగా, పోలీసుల విచారణలో కుట్ర పూరితంగానే కిషన్ రెడ్డిని గంజాయి కేసులో ఇరికించేందుకు ప్రయత్నించామని సుదర్శన్ అంగీకరించడం గమనార్హం.
ఇది ఇలా ఉండగా, తాను ఎలాంటి కుట్రలు చేయలేదని శ్రీధర్ బాబు మీడియాకు తెలిపారు. చట్టంతోనే కేసును ఎదుర్కొంటామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా స్థానిక ప్రజలకు, రైతులకు నీరు అందకుండా పోతోందని, పంట భూములు నాశనమవుతున్నాయని తాము పోరాటం చేస్తున్నామని.. ఇందుకోసమే ప్రభుత్వం కావాలని కేసులు బనాయిస్తోందని ఆరోపించారు.