మాజీ మంత్రి అఖిలప్రియకు షాక్.. భర్తపై కేసు.. పోలీసులపైకి కారుతో దురుసుగా
హైదరాబాద్/కర్నూలు: తెలుగుదేశం పార్టీ నాయకురాలు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ పైన గచ్చిబౌలి పోలిస్ స్టేషన్లో మంగళవారం కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం... ఓ కేసు విషయంలో భార్గవ్ను ప్రశ్నించేందుకు ఆళ్లగడ్డ రూరల్ ఎస్సై రమేష్ కుమార్ హైదరాబాద్కు వచ్చారు. కానీ భార్గవ్ కారు ఆపకుండా ఎస్సైతో దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు ఎస్సై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదయింది.
వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు
ఆళ్లగడ్డ సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ కుమార్ ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు.. అఖిలప్రియ భర్త భార్గవ్ పైన సెక్షన్ 353, 336 కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసుపై విచారణ జరుపుతున్నారు.
గచ్చిబౌలిలో ఏం జరిగిందంటే?
సమాచారం మేరకు.. భార్గవ్ పైన ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదు అయ్యాయి. అతనిని ప్రశ్నించేందుకు ఆళ్లగడ్డ పోలీసులు ప్రయత్నించారు. ఇందులో భాగంగా అతను గచ్చిబౌలిలో ఉన్నాడని గుర్తించి, ప్రశ్నించేందుకు ఆళ్లగడ్డ ఎస్పై రమేష్ కుమార్ వచ్చారు. అఖిలప్రియ భర్త ఓ కారులో ఉండటాన్ని ఎస్సై గమనించారు. గచ్చిబౌలిలోని ఓ హోటల్ వద్ద భార్గవ్ కారును ఆపే ప్రయత్నాలు చేశారు. కారును అలాగే పోనిచ్చే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో అతను పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడని ఫిర్యాదు అందడంతో గచ్చిబౌలి పీఎస్లో కేసు నమోదయింది.
ఆళ్లగడ్డలో అందుకే కేసులు..
వ్యాపార భాగస్వామిపై దాడికి పాల్పడిన ఘటనలో భార్గవ్ పైన ఆళ్లగడ్డ పోలీసులు కేసులు నమోదు చేశారు. కర్నూలు జిల్లా దొర్నిపాడి మండంలోని కొండాపురంకు చెందిన శివరామిరెడ్డికి ఆళ్లగడ్డ పట్టణ శివారులో శ్రీలక్ష్మీ ఇండస్ట్రీస్ పేరుతో క్రషర్ ఫ్యాక్టరీ ఉంది. ఇందులో అఖిలప్రియకు 40 శాతం వాటా ఉంది. శివరామిరెడ్డి మరో కంపెనీని కూడా నిర్వహిస్తున్నారు. ఇరువురి మధ్య వ్యాపారంలో బేదాభిప్రాయాలు వచ్చాయి. దీంతో ఘర్షణ చోటు చేసుకుంది. అఖిలప్రియ భర్త భార్గవ్ తన భర్తపై హత్యాయత్నం చేశారని శివరామిరెడ్డి భార్య మాధవీలత స్థానిక పోలీసులకు కంప్లయింట్ చేశారు. గత నెల 14న భార్గవ్, ఆయన అనుచరులు ఫ్యాక్టరీ వద్దకు వచ్చి కంపెనీకి బలవంతంగా తాళాలు వేశారని, 27వ తేదీన మరో కంపెనీని స్వాధీనం చేసుకున్నారని, ఆ రెండూ వారి పేరిట రాసివ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. దీంతో ఆళ్లగడ్డలో అతనిపై 143, 427, 447, 307, 507, సెక్షన్ల కింద కేసు నమోదయింది. భార్గవ్తో పాటు మరికొందరిపై కేసు నమోదయింది.