గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ స్కాం కేసు, సాక్షం చెప్పిన న్యాయమూర్తి, రూ. 40 కోట్లు లంచం?
హైదరాబాద్: బెయిల్ కుంభకోణం కేసులో నిందితుడు, కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి హైదరాబాద్లోని ఏసీబీ కోర్టులో సోమవారం హాజరైనారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న హైదరాబాద్ సీబీఐ కోర్టు మాజీ న్యాయమూర్తి బి. నాగ మారుతీ శర్మ కూడా ఏసీబీ కోర్టులో హాజరైనారు. ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో అప్పట్లో అరెస్టు అయిన గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ ఇవ్వడానికి న్యాయమూర్తి నాగమారుతి శర్మకు రూ. 40 కోట్లు లంచం ఇవ్వడానికి ప్రయత్నించారని, చివరికి మరో న్యాయమూర్తికి రూ. 15 కోట్లు లంచం ఇవ్వడానికి ప్రయత్నించారని కేసు నమోదైయ్యింది.
బళ్లారి మైనింగ్ కేసు
ఓబులాపురం మైనింగ్ (బళ్లారి) కేసులో గాలి జనార్దన్ రెడ్డిని గతంలో సీబీఐ అధికారులు అరెస్టు శారు. ఆ కేసులో బెయిల్ కోసం అప్పట్లో సీబీఐ కోర్టు న్యాయమూర్తిగా ఉన్న పట్టాభికి గాలి జనార్దన్ రెడ్డి వర్గం రూ. కొన్ని కోట్లు లంచం ఇచ్చారని ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.
జడ్జ్ కు రూ. 100 కోట్లు లంచం ?
బెయిల్ కుంభకోణం కేసు ప్రస్తుతం హైదరాబాద్ లోని ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగుతోంది. న్యాయమూర్తి పట్టాభికి లంచం ఇవ్వడానికి ముందు మరో న్యాయమూర్తి నాగ మారుతీ శర్మను ప్రభావితం చేసి రూ. 100 కోట్లు లంచం ఇవ్వడానికి నిందితులు ప్రయత్నించారని, మొదటి విడతగా రూ. 40 కోట్లు ఇస్తామని న్యాయమూర్తి నాగ మారుతి శర్మకు ఆశ చూపారని 2012లో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ డీల్ మొత్తం 2012 ఏప్రిల్ లో జరిగింది.
నో చెప్పిన న్యాయమూర్తి !
లంచం తీసుకుని గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన న్యాయమూర్తి బి. నాగ మారుతి శర్మ 2012 ఏప్రిల్ నెలలో వారం రోజులు సెలవులో వెళ్లారు. గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ ఇవ్వడానికి న్యాయమూర్తి నాగ మారుతి శర్మ నిరాకరించడంతో నిందితులు మరో న్యాయమూర్తి పట్టాభికి రూ. 15 కోట్లు లంచం ఇచ్చి వల వెయ్యడానికి ప్రయత్నించారని ఆరోపణలు ఉన్నాయి.
ఏసీబీ అధికారులు
లంచం తీసుకొని గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ ఇవ్వడానికి న్యాయమూర్తి నాగ మారుతీ శర్మ నిరాకరించారని దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులు కోర్టులో చెప్పారు. బెయిల్ కుంభకోణం కేసులో సాక్షం చెప్పడానికి న్యాయమూర్తి నాగ మారుతి శర్మ సిద్దం అయ్యారని అధికారులు అప్పట్లో కోర్టులో చెప్పారు.
సాక్షం చెప్పిన న్యాయమూర్త
సోమవారం న్యాయమూర్తి నాగ మారుతి శర్మ కోర్టులో హాజరై వాంగ్మూలం ఇచ్చారు. న్యాయమూర్తి నాగ మారుతి శర్మ పాక్షికంగా ఇచ్చిన వాంగ్మూలం నమోదు చేసిన న్యాయస్థానం తదుపరి విచారణ సెప్టెంబర్ 12వ తేదీకి వాయిదా వేసింది. ఇదే కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కోర్టులో హాజరైనారు.
బీజేపీ ఎమ్మెల్యేలకు నోటీసులు
ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న అప్పటి బళ్లారి ఎమ్మెల్యే, గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు గాలి సోమశేఖర్ రెడ్డి, కంప్లీ ఎమ్మెల్యే టీహెచ్. సురేష్ బాబుకు అప్పట్లో నోటీసులు జారీ చేశారు. ఆ సమయంలో అధికారులు స్వయంగా బళ్లారి చేరుకుని అప్పటి బీజేపీ ఎమ్మెల్యేలు గాలి సోమశేఖర్ రెడ్డి, సురేష్ బాబుకు నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు గాలి సోమశేఖర్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డి బంధువు జి. దశరథ రామిరెడ్డిని అధికారులు అప్పట్లో అరెస్టు చేశారు.