ఓటుకు నోటు: త్వరలో కీలక మలుపు, ఎవరా ముగ్గురు ఐపీఎస్ అధికారులు?
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో మరిన్ని కీలక విషయాలను ఎసిబి అధికారులు సేకరించారని వార్తలు వస్తున్నాయి. ప్రముఖ తెలుగు పత్రిక నమస్తే తెలంగాణ ఆదివారం నాడు ఆసక్తికర విషయాలు పేర్కొంది.
ఓటుకు నోటు కేసును నీరుగార్చేందుకు తెలుగుదేశం పార్టీ తరఫున వకాల్తా పుచ్చుకున్న ఓ ముగ్గురు సీనియర్ ఐపీఎస్లు కూడా ఫోన్లో మాట్లాడినట్టు కాల్డాటాలో తేలిందని ఓ కీలక అధికారి చెప్పినట్లుగా పేర్కొంది.
ఒక కేసులో నిందితులను రాష్ట్రం దాటించేయడంపై ఏసీబీ సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోందని, ఈ నేపథ్యంలో ఏపీ అధికారులకు నోటీసులిచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని, అవసరమైతే కోర్టు దృష్టికి తీసుకెళ్లి అనుమతి పొందుతామని కీలక అధికారి చెప్పారని పేర్కొంది.
ఏపీ పోలీస్ అధికారులకు కోర్టు ద్వారానే నోటీసులు ఇప్పించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని ఏసీబీ అధికారులు చెప్పారని, రెండు మూడు రోజుల్లో దీనిపై ఒక స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.
కాగా, ఓటుకు నోటు కేసులో తప్పించుకుని తిరుగుతున్న నిందితులు జెరూసలేం మత్తయ్య, జిమ్మీ, కొండల్ రెడ్డిలకు ఏపీ పోలీసులు షెల్టర్ ఇచ్చినట్టు ఏసీబీ దర్యాప్తు అధికారులు పక్కా ఆధారాలు సంపాదించారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
నిందితుల కాల్డాటాను పరిశీలించిన ఏసీబీ అధికారులు వాటి ఆధారంగా పలువురు ఏపీ పోలీసులకు విచారణకు రావాలంటూ సమన్లు పంపించే యోచనలో ఉన్నట్టు వార్తలొచ్చాయి. ఓటుకు నోటు కేసులో ఏ 4గా ఉన్న మత్తయ్య నుంచి తాజాగా లోకేశ్ డ్రైవర్ కొండల్ రెడ్డి వరకూ విచారణకు హాజరుకావడం లేదు.
వీరిపై దృష్టిసారించిన ఏసీబీ దర్యాప్తు బృందం నిందితులు తరచూ ఏపీ పోలీసు అధికారులు, టీడీపీ నాయకులతో మాట్లాడుతున్నారని గుర్తించినట్టు తెలుస్తోందని, ఈ నేపథ్యంలో ఏపీకి చెందిన పలువురు టీడీపీ నేతలకూ సమన్లు వెళ్లే అవకాశాలున్నాయని అంటున్నారని, కేసు ప్రారంభమైనప్పటినుంచి రేవంత్, సెబాస్టియన్తోపాటు జిమ్మీబాబుతో టీడీపీలోని కీలక హోదాలో ఉన్న నలుగురు నేతలు మాట్లాడినట్టు తమ వద్ద ఆధారాలున్నాయని ఏసీబీ వర్గాలు చెబుతున్నాయని పేర్కొంది.