రేవంత్ బెయిల్: కనిమొళి కేసు ప్రస్తావన! ఏసీబీ చేతికి రిపోర్ట్, ఉత్కంఠ
హైదరాబాద్: 2జి కుంభకోణంలో ప్రధాన నిందితురాలు కనిమొళి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టులో జరిగిన వాదనలను, సుప్రీం వ్యాఖ్యలను తెలంగాణ ఏసీబీ న్యాయవాది ప్రస్తావించారు. కనిమొళి కేసు విచారణ సమయంలో సుప్రీం చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు.
2జి స్కాం వెలుగు చూసిన తర్వాత ఎంపీ కనిమొళి ఆరు నెలలకు పైగా జైలులో ఉన్నారు. ఆ మధ్య కాలంలో ఆమె ఐదుసార్లు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే, సుప్రీం కోర్టు మాత్రం ఆమె శక్తివంతమైన మహిళ అని, ఇలాంటి కీలకమైన కేసులో ఆమెకు బెయిల్ ఇస్తే కేసును ప్రభావితం చేస్తారని వ్యాఖ్యానించి, బెయిల్ మంజూరు చేయలేదు.
రేవంత్ బెయిల్ పిటిషన్ వాదనల సమయంలో తెలంగాణ ఏసీబీ అడ్వోకేట్ జనరల్ రామకృష్ణా రెడ్డి ఈ విషయాన్ని ప్రస్తావించారు. అప్పుడు 2జి కేసు ఎంత ప్రముఖమైనదో, ఇప్పుడు ఓటుకు నోటు కేసు కూడా అంత ప్రముఖ్యం కలిగించేదేనని చెప్పారు. రేవంత్ ఒక ఎమ్మెల్యే అని, పక్క రాష్ట్రంలో ఆయన పార్టీ అధికారంలో ఉందని, బెయిల్ ఇస్తే ప్రభావం చూపుతుందన్నారు.
ఏసీబీ చేతిలో ఎఫ్ఎస్ఎల్ నివేదిక
ఓటుకు నోటు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరి (ఎఫ్ఎస్ఎల్) నివేదిక ఏసీబీకి చేరింది. ఎఫ్ఎస్ఎల్ అందించిన సీడీ, 3 హార్డ్ డిస్క్లను కోర్టు ఏసీబీ అధికారులకు అందజేసింది.
ఎఫ్ఎస్ఎల్ నివేదిక కావాలని కోర్టులో ఏసీబీ మెమో దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఎఫ్ఎస్ఎల్ నివేదిక కోసం ఎఫ్ఎస్ఎల్ అనుమతి తీసుకోవాలని కోర్టు ఏసీబీకి సూచించింది.
కోర్టు సూచనతో ఎఫ్ఎస్ఎల్ అనుమతి పత్రాన్ని ఏసీబీ తీసుకుంది. ఎఫ్ఎస్ఎల్ అనుమతి పత్రాన్ని కోర్టుకు సమర్పించిన అనంతరం ఏసీబీకి సీడీ, 3 హార్డ్ డిస్క్లను అందజేసింది. ఇక దర్యాప్తు వేగవంతం కానుంది. ఏసీబీ తదుపరి వ్యూహం ఏమిటనే దానిపై ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు.