ఓటుకు నోటు: మత్తయ్య, సండ్రల అప్పగింతకు ఎపి డిజిపికి ఎసిబి లేఖ?
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో నాలుగో నిందితుడు జెరూసెలం మత్తయ్యతో పాటు ఖమ్మం జిల్లా శాసనసభ్యుడు సండ్ర వెంకట వీరయ్యను తమ ఎదుట హాజరుపర్చాలని ఆంధ్రప్రదేశ్ డిజిపికి లేఖ రాసేందుకు తెలంగాణ ఏసీబీ సిద్ధమైనట్టు తెలిసింది. గత నెల 1న రేవంత్రెడ్డి అరెస్ట్కాగా, అప్పటినుంచి తప్పించుకొని తిరుగుతున్ననాలుగో నిందితుడు మత్తయ్య ఈ నెల 7న విజయవాడలోని సత్యనారాయణపురం పీఎస్లో ప్రత్యక్షమయ్యాడు.
తనకు బెదిరింపుకాల్స్ వచ్చాయని, తనను కేసులో ఇరికించాలని యత్నిస్తున్నారని ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. తమ రాష్ట్రంలోని కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మత్తయ్య తమ ఎదుట హాజరుకావాల్సిందేనని, కేసులో ఆయన పాత్ర ఏంటన్న దానిపై తాము విచారించాల్సిన అవసరం ఉందని ఏసీబీ తన లేఖలో స్పష్టం చేయనున్నట్లు తెలుస్తోంది.
అదే విధంగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను కూడా తమ ఎదుట హాజరుపరచాలని, లేని పక్షంలో తమకు అప్పగించాలని ఆ రాష్ట్ర డీజీపీ రాముడుకు రాసే లేఖలో కోరనున్నట్టు తెలిసింది. హైదరాబాద్లోని వైద్యశాలలో తాము అవసరమైతే చిక్సిత కూడా అందిస్తామని, లేని పక్షంలో తామే అక్కడికి వచ్చి విచారించేందుకు అవకాశం ఇవ్వాలని డీజీపీ రాముడును ఏసీబీ కోరే అవకాశం ఉందని అంటున్నారు.
తనకు ఆరోగ్య సమస్యలున్నాయని, పది రోజులపాటు మంచం దిగొద్దని డాక్టర్లు సూచించారని చెప్తున్న సండ్ర తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్లో దవాఖానల్లో చేరడంపై వివాదం చోటు చేసుకుంది. కనీసం ఏ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారనే వివరాలను కూడా బయటకు చెప్పడం లేదు. రాజమండ్రిలో ఓ దవాఖానలో చేరిన సండ్ర అర్ధరాత్రి అక్కడి నుంచి మరో రహస్య ప్రదేశానికి వెళ్లినట్లు చెబుతున్నారు.
సాక్షిగా వచ్చి కుట్రలో తన పాత్రేమీ లేదని, ఒకవేళ కుట్రకు సంబంధించిన వివరాలుంటే చెప్పి వెళ్లవచ్చని ఏసీబీ అంటోంది. కనీసం ఫోన్లో వివరాలు తీసుకుందామన్నా అందుబాటులో లేరని ఏసీబీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రికి వచ్చి వివరాలు తీసుకోవాలని భావిస్తున్నా ఏ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో కూడా తెలియడం లేదని అంటున్నారు.