ఓటుకు నోటు: కీలక మలుపు తీసుకోనుందా, సండ్రపై నిఘా
హైదరాబాద్: ఓటుకు నోటు కేసు కీలక మలుపు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. కేసులో దర్యాప్తు ప్రగతిపై తెలంగాణ ఎసిబి అధికారులు సోమవారంనాడు సమీక్షించారు. రేపు బుధవారం రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ హైకోర్టులో విచారణకు రానుంది. రేవంత్ రెడ్డికి బెయిల్ లభించకుండా అడ్డుకోవాలనే పట్టుదలతో ఎసిబి ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు పటిష్టమైన వాదనను తయారు చేసుకోవడంలో ఎసిబి అధికారులు నిమగ్నమై ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ నామినేటెడ్ శాసనసభ్యుడు స్టీఫెన్సన్కు డబ్బులు ముట్టజెబుతూ రేవంత్ రెడ్డి పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో టేప్ నిగ్గును తొలుత తేల్చాలని ఎసిబి అధికారులు ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ అధికారులను కోరినట్లు చెబుతున్నారు. దాని ఆధారంగానే కాకుండా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయాన్ని కూడా తేల్చేసి రేవంత్ రెడ్డితో పాటు ఇతర నిందితులకు బెయిల్ రాకుండా హైకోర్టులో పటిష్టమైన వాదనలు వినిపించాడనికి ఎసిబి సిద్ధఫడుతోంది.
రేవంత్ రెడ్డి స్టీఫెన్సన్కు ఇవ్వజూపిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై ఇంకా ఎసిబికి స్పష్టత రానట్లు చెబుతున్నారు. అధికారులు ఈ విషయంలో కొన్ని విషయాలు చెబుతున్నప్పటికీ వాటిపై ఉన్నతాధికారులకు గురి కుదరడం లేదని అంటున్నారు. ఈ స్థితిలో రేపటికల్లా డబ్బుల విషయం తేల్చే పనిలో ఎసిబి పడినట్లు తెలుస్తోంది.
మరోవైపు, అనారోగ్యం పేరు చెప్పి విచారణను తప్పించుకున్న ఖమ్మం జిల్లా టిడిపి శాసనసభ్యుడు సండ్ర వెంకట వీరయ్య కదలికలపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన ఎక్కడున్నారు, ఎక్కడెక్కడ తిరుతున్నారు అనే విషయాలపై ఎసిబి గట్టి నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఈ స్తితిలో బుధవారంనాటికి నోటుకు ఓటు కేసు కీలక మలుపు తిరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.