ఓటుకు నోటు మలుపు: ఈసీ చేతికి రేవంత్ వీడియో, బాబు ఆడియో!
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారం ఎన్నికల సంఘానికి చేరింది. ఈ కేసులో ఎసిబి స్వాధీనం చేసుకున్న ఆడియో, వీడియో ఆధారాలు ఈసికి అందజేశారు. ఈ ఆధారాలను ఇచ్చేలా ఎఫ్ఎస్ఎల్కు ఆదేశాలు జారీ చేయాలని ఈసి వేసిన పిటిషన్ను ఎసిబి న్యాయస్థానం అనుమతించింది.
కోర్టు ఉత్తర్వులు అందడంతో ఎసిబి ఇచ్చిన ఆడియో, వీడియో రికార్డింగుల హార్డ్ డిస్క్ కాపీని ఎఫ్ఎస్ఎల్ ఎన్నికల సంఘానికి ఇచ్చింది. ఓటుకు నోటు కేసులో ఎన్నికల సంఘం ఇప్పటికే కోర్టు నుంచి అన్ని పత్రాలను సేకరించింది. కేసును త్వరితగతిన ముగింపుకు తీసుకు రోవాలని ఈసి ఎసిబికి లేఖ రాసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ఓటుకు నోటు కేసులో ఈసి కూడా స్పీడ్ పెంచడంతో.. మరిన్ని మలుపులు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునేందుకు వీలుగా కేసుకు సంబంధించిన రాతపూర్వక వివరాలు, రిమాండ్ డైరీలు, ఎఫ్ఐఆర్, బెయిల్ కాపీలు తదితర పూర్తి నివేదికలను కోర్టు ద్వారా ఇప్పుడు ఈసీ తీసుకుంది.
మరోవైపు, చంద్రబాబుదిగా భావిస్తున్న ఆడియో, రేవంత్ సంభాషణలున్న సీడీలు ఈసీ చేతికివెళ్తున్నాయని తెలిసి టీడీపీ వర్గాల్లో కలవరం మొదలైందంటున్నారు. తప్పు చేసినట్లుగా తేలిన వారిపై అనర్హతవేటుకు అవకాశాలున్నాయని చెబుతున్నారు.
కోర్టు తీర్పులో ఎమ్మెల్యేకు శిక్ష పడితే అనర్హుడిగా ప్రకటించేందుకు ఈసి నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది. సెక్షన్ 10 ప్రకారం అన్ని ఆధారాలు ఉన్నట్లుగా ఈసి నిర్ధారించుకున్నాక తీర్పు వచ్చే వరకు వేచి చూడకుండానే నోటీసు జారీ చేయవచ్చునని కూడా అంటున్నారు.
సండ్రను కలిసిన టీడీపీ నేతలు
ఓటుకు నోటు కేసులో అరెస్టై చర్లపల్లి జైలులో ఉన్న సండ్ర వెంకయ వీరయ్యను టీడీపీ నేతలు శనివారం కలిశారు. సండ్రను కలిసిన వారిలో తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ, ఎంపీ మల్లా రెడ్డి, ఎమ్మెల్యేలు వివేకాంద, జి సాయన్న, మాగంటి గోపినాథ్, అరికెపూడి గాంధీ తదితరులు ఉన్నారు.