ఓటుకు నోటు, ఫోన్లో సెబాస్టియన్వే!: తదుపరి చర్యకు ఏసీబీ, బాబు శాంపిల్స్ కోరే ఛాన్స్
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో మరో విషయం వెల్లడైంది! కేసులో నిందితుడైన సెబాస్టియన్ నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లో రికార్డయిన సంభాషణలు కూర్చినవి కావని ఫోరెన్సిక్ ల్యాబోరేటరీ నిర్ధారించిందని తెలుస్తోంది. ఈ నివేదికను ఎఫ్ఎస్ఎల్ కోర్టుకు సమర్పించింది.
ఈ నివేదికను అవినీతి నిరోధక (ఏసిబి) శాఖ కోర్టు ద్వారా అధికారికంగా పొంది కూలంకషంగా అధ్యయనం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఫోన్లో రికార్డయిన సంభాషణలను ఏసీబీ రాతపూర్వకంగా కోర్టు ద్వారా ఫోరెన్సిక్కు అందించింది.
ఈ సంభాషణలన్నీ యదాతథంగా ఉన్నాయని కూడా ఫోరెన్సిక్ నివేదికలో నిర్ధారించినట్లుగా తెలుస్తోంది. ఈ రికార్డులో తెలంగాణ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్తో చంద్రబాబు మాట్లాడిన సంభాషణలు నమోదైనట్లు అభియోగాలు వచ్చిన విషయం తెలిసిందే.
ఈ సంభాషణలు కూడా కూర్చినవి కావని ప్రాథమికంగా నిర్ధారణ అయిందని సమాచారం. ఈ కేసులో తదుపరి చర్యకు ఏసీబీ సిద్ధమవుతోంది. సెబాష్టియన్ ఫోన్లో మొత్తం 516 టెలిఫోన్ సంభాషణలు ఉన్నాయి. ఇందులో 102 సంభాషణలు ఓటుకు నోటుకు సంబంధించినవి అని తెలుస్తోంది.
సెబాస్టియన్ ఫోన్ కీలకం!
ఈ కేసులో సెబాష్టియన్ ఫోన్ కీలకంగా మారిందని తెలుస్తోంది. మెజిస్ట్రేట్కు ఇచ్చిన వాంగ్మూలంలో స్టీఫెన్ సన్ తనను మే 30వ తేదీన సెబాష్టియన్ ఫోన్ చేసి చంద్రబాబు మాట్లాడుతారని చెప్పిన విషయం విదితమే. ఇప్పటికే ఈ కేసులో నిందితులైన సండ్ర వీరయ్య, రేవంత్ రెడ్డిల వాయిస్ శాంపిల్స్ను కోర్టును ఆశ్రయించి అసెంబ్లీ ద్వారా సేకరించింది.
ప్రస్తుతం ఏసిబి పోలీసులు కోర్టు ద్వారా చంద్రబాబు వాయిస్ శాంపిల్స్ కావాలని కోరే అవకాశాలున్నాయి. సెబాష్టియన్, జెరూసలేం వాయిస్ శాంపిల్స్ను ఎఫ్ఎస్ఎల్కు ఏసిబి పోలీసులు పంపించారు. ప్రస్తుతం ఈ శాంపిల్స్ను ల్యాబ్లో విశ్లేషిస్తున్నారు. నెల రోజుల క్రితమే సెబాష్టియన్ ఫోన్ను విశ్లేషణ నిమిత్తం కోర్టు ద్వారా ఏసీబీ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపింది. తమకు డాటా మిర్రర్ ఇమేజి కాపీ కావాలని కోర్టును ఏసిబి కోరింది.