ఓటుకు నోటు: పక్కా ఆధారాలు దొరికాకే 'బాస్' పేరు, లోకేష్పై నజర్!
హైదరాబాద్: ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి వేడెక్కింది. ఓటుకు నోటు కేసును తెలంగాణ ఎసిబి వేగవంతం చేసింది. బుధవారం నాడు లోకేష్ డ్రైవర్ కొండల్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. ప్రతిగా ఏపీ సీఐడీ కెటి రామారావు డ్రైవర్, గన్మెన్కు నోటీసులు ఇచ్చేందుకు సన్నద్ధమైంది.
ఓటుకు నోటు కేసు మరోసారి వేగవంతం కావడంతో 'బాస్' పేరును చేర్చుతారా? అనే చర్చ సాగుతోంది. ఓటుకు నోటు కేసు తెరపైకి వచ్చినప్పటి నుంచి బాస్ పేరును చేర్చుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఎసిబి ఆ దిశగా ముందుకు వెళ్తోందని తెలుస్తోంది.
ఛార్జీషీట్లో రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సిన్హాల పేర్లు చేర్చారు. టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పేరు చేర్చవచ్చునని చెబుతున్నారు.
దీనిపై అధికారులు ఓ పత్రికతో మాట్లాడుతూ... ఈ కేసులో మరికొందరి పేర్లను సప్లిమెంటరీ ఛార్జీషీటులో కలిపే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అయితే, బాస్ పేరును చేర్చే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారని తెలుస్తోంది. ఆధారాలు పూర్తిగా దొరికిన తర్వాతనే పేర్లను ఛార్జీషీట్లో కలుపుతామని చెప్పారు.
అదే సమయంలో లోకేష్ పైన మాట్లాడేందుకు కూడా నిరాకరించారని సమాచారం. ఎసిబి అధికారులు ముఖ్యంగా లోకేష్ పైన నజర్ వేసినట్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
లోకేష్ డ్రైవర్ కొండల్ రెడ్డి ఫోన్ నుంచి రేవంత్ రెడ్డి గన్మెన్లు మాట్లాడినట్లుగా వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ గన్మెన్లతో కొండల్ రెడ్డి ఎందుకు మాట్లాడాడు? ఆ ఫోన్ నుంచి అసలు మాట్లాడిందెవరు? అనే అంశాల పైన ఆరా తీస్తున్నట్లుగా సమాచారం. ఓటుకు నోటు కేసులో లోకేష్ పాత్ర పైన కూడా ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఓటుకు నోటు కేసులో కొండల్ రెడ్డికి నోటీసులు ఇవ్వడంతో.. ఫోన్ ట్యాపింగ్ కేసును ఏపీ సిఐడి వేగవంతం చేసింది. ఈ కేసులో కెటిఆర్ గన్మెన్, డ్రైవర్కు నోటీసులు ఇచ్చేందుకు సన్నద్దమైంది. మరోవైపు, విశాఖ జిల్లా పెందుర్తి ఘటనను తెరపైకి వచ్చింది.
విశాఖ జిల్లాలో రెండేళ్ల క్రితం ఒడిశా నుంచి ప్రముఖ కాంట్రాక్టర్ను కిడ్నాప్ చేసి ఏపీకి పారిపోయి వచ్చిన వ్యక్తులను పట్టుకోవాలని ఒడిశా పోలీసుల నుంచి సమాచారం అందింది. దీంతో విశాఖ జిల్లా పెందుర్తి పోలీసులు సదరు వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఆ క్రమంలో పెందుర్తి ఎస్సై పన వారు దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసులు కొంతమందిని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో అప్పట్లో... కెటిఆర్కు అనుచరుడైన సతీష్ రెడ్డితో పాటు మరికొంతమంది ఉన్నారు.
వారికి నోటీసులు ఇచ్చేందుకు పెందుర్తి పోలీసులు బుధవారం హైదరాబాద్ వచ్చారు. నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు కరీంనగర్ జిల్లాకు వెళ్లారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు గన్మెన్ల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేయవలసి ఉందని, అందుకే నోటీసులు ఇచ్చేందుకు వచ్చామని పోలీసులు చెప్పారు.