టెక్కీ: వేం కుమారుడు కృష్ణ కీర్తన్ రెడ్డికి బిగిస్తున్న ఉచ్చు
హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్ రెడ్డి చుట్టూ కూడా ఉచ్చు బిగిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. వేం నరేందర్ రెడ్డిని గెలిపించడానికే తెలంగాణ నామినేటెడ్ శాసనసభ్యుడు స్టీఫెన్సన్కు లంచం ఇస్తూ టిడిపి శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి, మరో ఇద్దరు తెలంగాణ ఎసిబికి చిక్కారు.
స్టీఫెన్సన్కు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి జట్టు తెచ్చిన రూ. 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై ఎసిబి అధికారులు ప్రధానంగా దృష్టి పెట్టారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఆ మొత్తాన్ని ఏర్పాటు చేశాడని, ఆ సొమ్మును ఆయన కుటుంబ సభ్యులు నిందితులకు అందించారని ఎసిబి అధికారులు భావిస్తున్నారు.
ఎసిబి అధికారులు వేం నరేందర్ రెడ్డినే కాకుండా ఆయన కుమారుడు కృష్ణ కీర్తన్ రెడ్డిని కూడా విచారించారు. కేసులో అరెస్టయినవారితో కృష్ణ కీర్తన్ రెడ్డి ఫోన్లో పలుమార్లు మాట్లాడినట్లు ఎసిబి అధికారులు ధ్రువీకరించుకున్నారు. ఓ బహుళ జాతి సంస్థ (ఎంఎన్సి)లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న కృష్ణ కీర్తన్ రెడ్డి ఆ ఫోన్ తనది కాదని ఎసిబి అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది.
నిజానికి, ఆ ఫోన్ కృష్ణ కీర్తన్ రెడ్డి పేరు మీద లేదు. అది వేరొకరి పేరు మీద రిజిష్టర్ అయి ఉంది. తన పేరు మీద ఉన్నప్పటికీ దాన్ని కృష్ణ కీర్తన్ రెడ్డి మాత్రమే వాడుతున్నాడని అతను ఎసిబి అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. కృష్ణ కీర్తన్ మాత్రమే ఆ ఫోన్ వాడుతున్నాడని నిరూపించడానికి అవసరమైన పత్రాలను అతను ఉద్యోగం చేస్తున్న కార్యాలయం నుంచి ఎసిబి అధికారులు పొందినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
కేసులో కృష్ణ కీర్తన్ రెడ్డికి ప్రత్యక్ష పాత్ర ఉందని, డబ్బులు అతనికి సన్నిహితంగా ఉండేవారు అందజేశారని ఎసిబి అధికారులు భావిస్తున్నారు. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై తమకు అంచనా ఉందని, అయితే అందుకు తగిన ఆధారాలను సేకరిస్తున్నామని, డబ్బులు అందజేసిన వ్యక్తి పేరు ఎఫ్ఐఆర్లో ఇంకా చేర్చలేదని ఎసిబి అధికారులు అంటున్నారు.
స్టీఫెన్సన్కు ఇవ్వజూపిన రూ. 50 లక్షలు, ఇస్తామని హామీ ఇచ్చిన రూ.4.5 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయాన్ని తెలుసుకోవడానికే ఎసిబి అధికారులు రేవంత్ రెడ్డి అనుచరులు సైదులును, అల్లూరి నారాయణ రాజును ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.