సండ్ర విచారణలో కీలక విషయాలు, టిఆర్ఎస్ ఎమ్మెల్యేకూ నోటీసు!
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అరెస్టు, విచారణ పూర్తి కావడంతో ఏసీబీ అధికారులు తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు. త్వరలో మరో ఇద్దరు ముగ్గురికి నోటీసులు జారీ చేసే యోచనలో ఉన్నట్లగా తెలుస్తోంది. అందులో ఓ టిఆర్ఎస్ ఎమ్మెల్యేకు నోటీసులు ఇవ్వొచ్చు.
జిమ్మీకి ఎసిబి ఇదివరకే నోటీసులు జారీ చేసింది. ఆయన ఇంతవరకు ఎసిబి ఎదుట హాజరు కాలేదు. ఓటుకు నోటు కేసులో ఇప్పటి వరకు నలుగురు అరెస్టయ్యారు. అందులో రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సిన్హాలు నెల రోజులు జైలులో ఉండి బెయిల్ పైన విడుదలయ్యారు.
ఆ తర్వాత సండ్ర ఇటీవల అరెస్టై చర్లపల్లి జైలులో ఉన్నారు. ఎసిబి అధికారులు రేవంత్ తీసుకు వచ్చిన రూ.50 లక్షలు ఎక్కడివి, మిగతా రూ.4.5 కోట్లు ఎక్కడున్నాయనే విషయాల పైన ఆరా తీస్తున్నారు. సెబాస్టియన్ మధ్యవర్తిత్వంతో మొదట సండ్రనే స్టీఫెన్ సన్తో మాట్లాడారని తెలుస్తోంది.
దీనికి సంబంధించి కొంత సమాచారం సెబాస్టియన్ ఫోన్లో రికార్డయి ఉంది. దానిని ఎసిబి అధికారులు సేకరించారు. ఈ సంభాషణల్లో ఇంకా కొన్ని పేర్లు వినిపించినట్లుగా తెలుస్తోంది. వాటి ఆధారంగా విచారణ కోసం ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు, ఖమ్మం జిల్లా టిడిపి నేతకు నోటీసులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బెయిల్ పిటిషన్ విచారణకు
సండ్ర బెయిల్ పిటిషన్ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో సోమవారం విచారణకు రానున్నది. కాగా బెయిల్ పిటిషన్పై ఏసీబీ అధికారులు అభ్యంతరం చెప్పనున్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో మరింతమంది నిందితులు పరారీలో ఉన్నారని వాదనలు వినిపించనున్నట్లు సమాచారం.
కోర్టుకు రేవంత్ రెడ్డి
ఓటుకు నోటు కేసులో బెయిల్పై విడుదలైన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, మరో ఇద్దరు నిందితులు సెబాస్టియన్, ఉదయ సిన్హా సోమవారం ఏసీబీ కోర్టుకు హాజరుకానున్నారు. న్యాయస్థానం జూలై 13 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అయితే జూలై 1న హైకోర్టు ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది.