ఓటుకు నోటు.. ఏం జరుగుతోంది: కేసీఆర్ కదలికపై బాబు ఆరా, హైరానా!
హైదరాబాద్: ఏడాది తర్వాత ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. వైసిపి ఎమ్మెల్యే పిటిషన్ మేరకు కోర్టు ఆదేశాలు సోమవారం జారీ చేయడం, మంగళవారం నాడు తెలంగాణ సీఎం కేసీఆర్ గవర్నర్ నరసింహన్తో సుదీర్ఘ సమయం భేటీ కావడం, అదే సమయంలో రాజ్ భవన్కు ఏసీబీ డీజీ ఏకే ఖాన్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఏసీబీ డీజీ ఏకే ఖాన్.. గవర్నర్, సీఎంలకు దర్యాఫ్తు వివరాలు వెల్లడించారని తెలుస్తోంది. కేసు దర్యాఫ్తు ఎంత వరకు వచ్చిందనే విషయం కూడా చెప్పారని సమాచారం. గతంలో మత్తయ్య పిటిషన్ పైన సుప్రీం కోర్టుకు వెళ్లిన విషయాన్ని వివరించారని తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో ఈ కేసు సుప్రీంలో విచారణకు రానుందని చెప్పారు.
కాగా, ఓటుకు నోటు కేసు నేపథ్యంలో రాజకీయంగా చెడ్డపేరు రావొద్దని కేసీఆర్ అభిప్రాయంగా ఉందని తెలుస్తోంది.
చంద్రబాబు ఆరా!
కోర్టు ఆదేశాలు, గవర్నర్తో కేసీఆర్ భేటీ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ అడుగుల పైన చంద్రబాబు ఆందోళనగా ఉన్నట్లుగా తెలుస్తోందని అంటున్నారు. గవర్నర్తో కేసీఆర్ భేటీ పైన సమాచారం సేకరించారని తెలుస్తోంది.
అలాగే, ఏసీబీ డీజీ ఏకే ఖాన్ సమర్పించిన నివేదికలోని అంశాల పైన టిడిపి నేతల్లో టెన్షన్ నెలకొన్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. ఇంటెలిజెన్స్, ఇతరుల ద్వారా చంద్రబాబు సమాచారం సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది.
కాగా, ఓటుకు నోటు కేసులో పూర్తి విచారణ జరపాలని, పిటిషనర్ దాఖలు చేసిన సాక్ష్యాలను పరిశీలించాలని, ఈ కేసులో పూర్తి దర్యాఫ్తు, విచారణ అవసరమని కోర్టు సోమవారం చెప్పింది. పిటిషనర్ అందించిన అంశాలను సంబంధిత పోలీసులకు ఇవ్వాలని చెప్పింది. వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, ఓటుకు నోటు కేసు నిందితులు పక్క రాష్ట్రాలకు వెళ్తున్నట్లుగా కూడా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి.