నోటుకు ఓటు: చంద్రబాబు డ్రైవర్లు, సెక్యూరిటీ సిబ్బంది పాత్రపై ఆరా
హైదరాబాద్: నోటుకు ఓటు కేసు దర్యాప్తును తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) ముమ్మరం చేసినట్లు కనిపిస్తోంది. కేసు దర్యాప్తులో కొత్త విషయాలు అనేకం వెల్లడువుతున్నట్లు తెలుస్తోంది. బయటకు వస్తున్న విషయాల ఆధారంగా ఎసిబి దర్యాప్తును కొనసాగిస్తోంది.
తాజా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వద్ద పనిచేస్తున్న డ్రైవర్లు, సెక్యూరిటీ సిబ్బంది ప్రమేయంపై ఎసిబి అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వీరి ఫోన్ నెంబర్లతో ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసినట్లుగా ఎసిబి గుర్తించినట్లు సమాచారం.
రికార్డు అయిన కాల్ డేటా ఆధారంగా ఎసిబి అధికారులు దర్యాప్తును సాగిస్తున్నారు. బుధవారం చంద్రబాబు నివాసానికి వెళ్లిన తెలంగాణ పోలీసులు ఆయన ఇంటి సమీపంలో విచారించారు. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ వద్ద పనిచేస్తున్న భద్రతా సిబ్బంది, వారి ఫోన్ నెంబర్లపైనా ఎసిబి అధికారులు ఆరా తీసినట్లు చెబుతున్నారు.
వచ్చి పోయే కార్ల నెంబర్లను సేకరించారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణ హోం శాఖ ముఖ్యమంత్రి కార్యదర్సి రాజీవ్ త్రివేదికి నోటీసులు ఇచ్చేందుకు హడావిడి చేసినట్లు భావిస్తున్నారు.
గురువారం హైదరాబాద్, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గన్మెన్ రాంబాబును ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. కేసు దర్యాప్తునకు అవసరమైన సమాచారం సేకరించాల్సి ఉందని సాక్షిగా తమ ఎదుట హాజరు కావాల్సిందిగా గన్మెన్ రాంబాబుకు నోటీసులిచ్చిన విషయం తెలిసిందే.
నోటీసులు అందుకున్న ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గన్మెన్ గురువారం ఏసీబీ అధికారుల ముందు హాజరయ్యారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా రాంబాబును ఏసీబీ అధికారులు ప్రశ్నించారు.