సెబాస్టియన్ ఫోన్లో కీలక ఆధారం, తెలంగాణ ట్యాపింగ్ చేయొచ్చు: జెత్మలానీ ట్విస్ట్
హైదరాబాద్: ఓటుకు నోటు కేసు దర్యాఫ్తు మళ్లీ వేగవంతం కానుంది. సాంకేతికపరమైన అఢ్డంకులు తొలగిపోవడం, కీలకమైన సమాచారం వెల్లడి కావడంతో దర్యాఫ్తు వేగం పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. కేసులో నిందితుడైన సెబాస్టియన్ నుంచి ఎసిబి రెండు ఫోన్లు స్వాధీనం చేసుకుంది.
ఆ రెండు ఫోన్లలో ఒక దానిలోని సమాచారం సులభంగానే విశ్లేషించారు. దానిలోని సమాచారం, డిలీట్ చేసిన సమాచారాన్ని, రికార్డయిన సంభాషణల వంటి వాటిని కోర్టుకు సమర్పించారు. వీటి ఆధారంగా సండ్ర వెంకట వీరయ్యకు, సెబాస్టియన్కు మధ్య జరిగిన సంభాషణ వివరాలను కోర్టుకు సమర్పించారు.
సెబాస్టియన్ రెండో ఫోన్ నుంచి ప్రముఖ వ్యక్తులతో మాట్లాడినట్లుగా ఎసిబి అనుమానిస్తోంది. వారిలో బాస్ ఉన్నారా లేరా అనేది తెలియాల్సి ఉంది. ఈ రెండో ఫోన్ కొత్త టెక్నాలజీది. దీంతో సమాచారాన్ని సేకరించేందుకు వారికి తొలుత సాధ్యం కాలేదు.
చివరకు అవసరమైన సాఫ్టువేర్ను తెప్పించి సమాచారం సేకరించారు. దీనికి సంబంధించిన నివేదిక కూడా సిద్ధమైందని తెలుస్తోంది. ఇందులో పలువురు కీలక వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణలు, సంక్షిప్త సందేశాల సమాచారం ఉందని సమాచారం. త్వరలోనే దీనిని పోరెన్సిక్ నిపుణులు కోర్టుకు సమర్పించనున్నారు. దీని ఆధారంగా మళ్లీ దర్యాఫ్తు వేగవంతమవుతుందని తెలుస్తోంది.
ఫోన్ ట్యాపింగ్: తెలంగాణ తరఫున రామ్ జెత్మలానీ
ఫోన్ ట్యాపింగ్ అంశంపై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. వారం రోజుల్లో కాల్ లిస్ట్ ఇవ్వాలని విజయవాడ కోర్టు సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కాల్ లిస్ట్ అడగడం సరికాదని చెప్పింది.
దీనిపై హైకోర్టులో గురువారం వాదనలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ తరఫున రామ్ జెత్మలానీ వాదనలు వినిపిస్తున్నారు. కాల్ డేటా ఇవ్వాలని చెప్పే హక్కు బెజవాడ న్యాయస్థానానికి లేదని ఆయన వాదనలు వినిపించారు.
తెలంగాణ ప్రభుత్వానికి ఫోన్ ట్యాప్ చేసే హక్కుందని జెత్మలానీ చెప్పారు. టిడిపి నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు టి సర్కార్ చెప్పిందని, ఓటుకు నోటు కేసు నమోదైన తర్వాతే ట్యాప్ చేసిందని జెత్మలానీ అన్నారు. సర్వీస్ ప్రొవైడర్లకు హోంశాఖ కార్యదర్శి నుంచి లేఖలు రాశామని చెప్పారు.
ఫోన్ ట్యాపింగ్ సరికాదని అదనపు సొలిసిటర్ జనరల్ నటరాజన్ అన్నారు. దేశభద్రతకు ముప్పు ఏర్పడినప్పుడు, అసాంఘీక శక్తుల ఫోన్లను ట్యాపింగ్ చేయవచ్చునని చెప్పారు. దీనికి రాష్ట్ర, కేంద్ర హోంశాఖల అనుమతి అవసరమన్నారు. రాజకీయ నాయకులు, ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగేలా ట్యాపింగ్ సరికాదన్నారు. దాదాపు నాలుగు గంటల పాటు హైకోర్టులో వాదనలు జరిగాయి.