ఓటుకు నోటు కేసు నిందితుడి సెబాస్టియన్ మహిళ పట్ల అసభ్యంగా...
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో నిందితుడైన సెబాస్టియన్పై మరో కేసు నమోదైంది. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని హైదరాబాదులో ఎస్ఆర్ నగర్ పోలీస్స్టేషన్లో ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాదు నగరశివారులోని ఏజి కాలనీ సమీపంలోని వికాస్పురి కాలనీకి చెందిన ఫిలిప్స్ అనే వ్యక్తి ఇంట్లో సెబాస్టియన్ 2002 నుంచి అద్దెకు ఉంటున్నారు.
కాగా ఇంటి యజమానికి, సెబాస్టియన్కు మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో సెబాస్టియన్ తాను అద్దెకు ఉంటున్న ఇంటికి మరమ్మతు పనులు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఇంటి యజమాని భార్య విజయ తమకు సమాచారం లేకుండా ఇంటికి మరమ్మతు పనులు ఎలా చేస్తున్నారంటూ నిలదీశారు.
దీంతో సెబాస్టియన్ తన చేతిలో ఉన్న సెల్ఫోన్ లాక్కోవడంతో పాటు తన చేయిపట్టి లాగి అసభ్యకరంగా ప్రవర్తించాడని బాధితురాలు విజయ ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సెబాస్టియన్పై ఐపిసి సెక్షన్ 354 ప్రకారం కేసు నమోదు చేసినట్టు సబ్ ఇన్స్పెక్టర్ అజయ్కుమార్ తెలిపారు.
తెలంగాణలో ఎమ్మెల్యేను కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన కేసులో టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో సెబాస్టియన్ నిందితుడు.