ఓటుకు నోటు కేసు నిందితుడి మత్యయ్య సికింద్రాబాదులో ప్రత్యక్షం
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో నిందితుడు జెరూసలేం మత్తయ్య సికింద్రాబాదులో ప్రత్యక్షమయ్యారు. ఆయన సమాజ్వాదీ పార్టీ మీడియా కో ఆర్డినేటర్గా తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు నాగలక్ష్మి సమక్షంలో బాధ్యతలు చేపట్టారు.
వచ్చే గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ ఎన్నిక్లలో 150 డివిజన్లలో తమ పార్టీ పోటీ చేస్తుందని మత్తయ్య చెప్పారు. వంద సీట్లకు పైగా తాము గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ ఐదవ వార్డు జ్యోతి కాలనీలో సమాజ్వాదీ పార్టీ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులను వివిధ పార్టీ పదవుల్లో నియమించారు. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షునిగా ఎఎస్ శ్రీనివాస్, మీడియా కోఆర్డినేటర్గా జెరూసలేం మత్తయ్యకు బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లయన్ సీ ఫ్రాన్సిస్, సెక్రటరీ జనరల్ సుజాన్, ఆర్గనైజర్ చంద్రశేఖర్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఓటుకు నోటు సంఘటన వెలుగు చూడగానే మత్తయ్య తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులకు చిక్కకుండా పారిపోయారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తలదాచుకుంటున్నట్లు చెబుతూ వచ్చారు.