రెండ్రోజుల్లో ఫోరెన్సిక్ రిపోర్ట్, తెలంగాణ నెమ్మది, ఏపీ దూకుడు
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఫోరెన్సిక్ నివేదిక రెండు రోజుల్లో రావొచ్చని తెలుస్తోంది. ఈ కేసులో ఫోరెన్సిక్ నివేదిక చాలా కీలకం. దీని కోసం తెలంగాణ రాష్ట్ర ఏసీబీ అధికారులు నిరీక్షిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో ప్రాథమిక నివేదిక అందుతుందని భావిస్తున్నారు.
ఫోరెన్సిక్ నివేదిక పైనే తదుపరి దర్యాఫ్తు ఆధారాపడి ఉందని తెలుస్తోంది. ఫోరెన్సిక్ నిపుణులు సెలవులో ఉన్నప్పటికీ కేసు తీవ్రత దృష్ట్యా సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.
తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్కు డబ్బులు ఇస్తూ పట్టుబడ్డ వీడియో వెలుగు చూసింది. ఆ తర్వాత స్టీఫెన్ సన్తో చంద్రబాబు గొంతుగా భావిస్తున్న ఆడియో టేప్ విడుదలయింది.
రేవంత్ వీడియో, చంద్రబాబుదిగా భావిస్తున్న ఆడియోలను ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించారు. అవి నిజమైనవా? కావా? అన్న విషయాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణులు నిర్ధారించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నివేదికలు వచ్చాక దర్యాఫ్తు ఊపందుకోనుంది.
మరోవైపు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏపీ దూకుడుగా వెళ్తోంది. ఏపీలో నమైదైన 88 కేసులకు సంబంధించి సిట్ విచారణను వేగవంతం చేసిన విషయం తెలిసిందే. టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు సోమవారం ఆధారాలు అందిచ్చే అవకాశముంది.
ఫోన్ ట్యాప్ అనుమతి కోరింది ఎవరు, ఎవరి సంతకంతో వచ్చాయి, ఏ తేదీన లేఖలు వచ్చాయి, ట్యాపింగ్ ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు జరిగింది, వాటికి సంబంధించిన కాల్ లాగ్స్ తదితర వివరాలను సిట్ అధికారులు సర్వీస్ ప్రొవైడర్లను కోరారు. వీటికి సంబంధించిన ఆధారాలు అందితే, ఎవరెవరిని నిందితులుగా చేర్చాలనే దానిపై సిట్ కసరత్తు చేయనుంది.