రాష్ట్రం విడిచి పారిపోయిన జిమ్మీ బాబు: అదే దారిలో కొండల్ రెడ్డి?
హైదరాబాద్: తెలంగాణ ఎసిబి నుంచి తప్పించుకుని తిరుగుతున్న తెలుగు యువత నాయకుడు జిమ్మి బాబు రాష్ట్రం విడిచి పారిపోయినట్లు భావిస్తున్నారు. ఓటుకు నోటు కేసులో ఎసిబి నోటీసు ఇచ్చినా విచారణకు ఆయన డిమ్మా కొట్టాడు. అతను పొరుగు రాష్ట్రంలో తల దాచుకున్నట్లు చెబుతున్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పారిపోయాడా, మరో రాష్ట్రంలో ఉన్నాడా అనే విషయం తెలియడం లేదు.
కాగా, తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ వద్ద డ్రైవర్గా పనిచేసిన కొండల్ రెడ్డి కూడా జిమ్మి బాబు దారి పట్టవచ్చునని అంటున్నారు. కొండల్ రెడ్డి గురువారంనాడు ఎసిబి విచారణకు హాజరు కావాల్సి ఉండింది. అయితే, అతను గైర్హాజరయ్యాడు.
ప్రస్తుతం కొండల్ రెడ్డి ఎక్కడున్నాడనే విషయం తెలియడం లేదు. కానీ ఓ ప్రముఖ రాజకీయ నేత నివాసంలో తలదాచుకున్నట్లు ప్రచారం సాగుతోంది. అతన్ని కూడా రాష్ట్రం సరిహద్దులు దాటించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు.
జిమ్మిబాబుకు రాష్టంలోని కొంత మంది నాయకుల నుంచి ఆర్థిక సాయం అందుతున్నట్లు ఎసిబి అధికారులు భావిస్తున్నారు. దీంతో నోటుకు ఓటు కేసులో అనుమానితులకు, నిందితులకు ఆశ్రయం కల్పిస్తున్నవారిపై ఎసిబి దృష్టి సారించినట్లు సమాచారం.
నోటుకు ఓటు కేసులో నిందితుడు మత్తయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నట్లు పక్కా సమాచారం ఉంది. అయితే, అతను అరెస్టు నుంచి తప్పించుకోవడానికి పలు ఎత్తుగడలు వేస్తున్నాడు. ఎసిబి విచారణకు హాజరు కాకుండా తెలంగాణ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కొంత కాలం అనారోగ్యం పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తలదాచుకున్న విషయం తెలిసిందే.