ఓటుకు నోటులో సంచలనాలు: అప్పుడే స్కెచ్, ఎర్రబెల్లి పాత్ర, స్టీఫెన్ ఓకే?
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు బండారం బయటపడిందంటూ వైసిపి అధినేత వైయస్ జగన్కు చెందిన సాక్షిలో కథనం వచ్చింది. మహానాడు నుంచే కుట్ర జరిగిందని, ఎమ్మెల్యేల కొనుగోలుకు స్కెచ్ వేశారని పేర్కొంది.
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో చంద్రబాబు బండారం బయటపడిందంటూ వైసిపి అధినేత వైయస్ జగన్కు చెందిన సాక్షిలో కథనం వచ్చింది. మహానాడు నుంచే కుట్ర జరిగిందని, ఎమ్మెల్యేల కొనుగోలుకు స్కెచ్ వేశారని పేర్కొంది.
ఈ కేసు అనుబంధ చార్జీషీటులో సంచలనాత్మక అంశాలు ఉన్నాయని ఆ కథనంలో పేర్కొంది. చంద్రబాబు నేతృత్వంలో ఎమ్మెల్యేలను కొనేందుకు సమావేశమయ్యారని, ముగ్గురు ఎమ్మెల్యేలను కొనేందుకు ఆదేశాలు జారీ చేశారని తెలిసినట్లుగా పేర్కొంది.
ఓటుకు నోటు, సుప్రీం ఝలక్: 'ఇబ్బందికరమే చంద్రబాబు తప్పించుకోలేరు'
టిడిపి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్లు అదే పనిలో బిజీగా గడిపారని, క్యాంప్ కోసం నోవాటెల్ హోటల్లో తొమ్మిది గదులను ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర రావు బుక్ చేశారని తెలిసిందని పేర్కొంది.
మాజీ డిప్యూటీ సీఎం రాజయ్యను కూడా టిడిపి ట్రాప్ చేసిందని పేర్కొంది. రేవంత్ పట్టుబడటానికి ముందురోజు స్టీఫెన్సన్ ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారని, చంద్రబాబు ఆఫర్ నచ్చిందని సెబాస్టియన్కు స్టీఫెన్ చెప్పారని పేర్కొంది. ఈ మేరకు సాక్షిలో కథనం వచ్చింది. సాక్షి కథనం ప్రకారం...
ఆ కథనం ప్రకారం..
ఓటుకు నోటు కేసులో కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయని ఆ కథనం ప్రారంభించింది. 'ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రలో తన పాత్ర లేదని ఓసారి, తన ఫోన్ ట్యాప్ చేశారని మరోసారి చంద్రబాబు చెప్పారని, ఈ కేసులో ఆయన పాత్రను ఏసీబీ ఎత్తి చూపింది. ఏసీబీ అధికారులు ఇటీవల ఈ కేసులో అనుబంధ ఛార్జీషీట్ దాఖలు చేశారు.
సంభాషణలు
ఇందులో రేవంత్, సండ్రలు సాగించిన సంభాషణలు, స్టీఫెన్ సన్తో సెబాస్టియన్ ఫోన్ ద్వారా చంద్రబాబు మాట్లాడిన మాటలు, డీల్ కోసం సెబాస్టియన్ - స్టీఫెన్సన్ సాగించిన పూర్తి సంభాషణలను ఏసీబీ కోర్టుకు సమర్పించింది. ఏకంగా 136 పేజీలతో దాఖలు చేసిన అనుబంధ ఛార్జీషీటులో అడుగడుగునా చంద్రబాబు పాత్ర ఉన్నట్లు ఏసీబీ స్పష్టం చేసింది.
మహానాడు కేంద్రంగా స్కెచ్
28 మే 2015న మహానాడు కేంద్రంగా పలువురు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తమ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకునేందుకు చంద్రబాబు స్కెచ్ వేశారు. ఎమ్మెల్యేలను తమ వైపు రప్పించుకునేందుకు ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత అప్పగించారు. రేవంత్, సండ్రలు ఎమ్మెల్యేలతో మాట్లాడారు.
ముగ్గురు ఎమ్మెల్యేలు టార్గెట్
25 మే 2015న ఎమ్మెల్యేల చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా స్టీఫెన్ సన్ను ట్రాప్ చేసేందుకు టిడిపి క్రిస్టియన్ లీగల్ సెల్ లీడర్ సెబాస్టియన్ రంగంలోకి దిగారు. అతడితో పాటు జెరూసలేం మత్తయ్య, జిమ్మి, హెలెన్ బాబులు కూడా గ్రూప్గా ఏర్పడ్డారు. రేవంత్, సండ్రలను వీరితో టచ్లో ఉండాలని సూచించారు. ఇదే విషయాన్ని సంభాషణల్లో సండ్ర, రేవంత్, సెబాస్టియన్ స్పష్టం చేసుకున్నారు. మే 26 నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారు.
రాజయ్యను ట్రాప్లో పడేసేందుకు..
మాజీ డిప్యూటీ సీఎం రాజయ్యను కూడా ట్రాప్లో పడేయాలనుకున్నారు. మహానాడు బయలుదేరేముందు చంద్రబాబు ఇంట్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజయ్యను ట్రాప్ చేసినట్లు సండ్ర.. సెబాస్టియన్కు చెప్పారు.
ఒరిజినలేనని ధ్రువీకరించారని..
ఏసీబీకి కీలక అధారంగా మారిన సెబాస్టియన్ ఫోన్లో ప్రతి ఫోన్ కాల్ సంభాషణలు రికార్డయ్యాయి. ఈ ఫోన్ ద్వారానే అటు రేవంత్, సండ్రకు, ఇటు ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో సాగించిన సంభాషణలను ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ (ఎఫ్ఎస్ఎల్) ద్వారా ఏసీబీ నివేదికలు తెచ్చుకుంది. దీంతో 'బ్రీఫ్డ్ మీ' బయటపడింది. సెబాస్టియన్ ఫోన్ ద్వారా ఎమ్మెల్యే స్టీఫెన్ సన్కు ఫోన్ చేసి .. 'బాబుగారు మాట్లాడుతారు. లైన్లో ఉండండి' అని చెప్పిన ఆడియో అసలుదేనని, ట్యాపింగ్ వల్ల రికార్డయింది కాదని, ఎక్కడ కూడా ఎడిటింగ్ లేదని నివేదిక తెలిపింది. అది సెబాస్టియన్ ఫోన్లోనే రికార్డయిందని సమయంతో సహా ఎఫ్ఎస్ఎల్ చెప్పిందని ఏసీబీ తన ఛార్జీషీటులో పేర్కొంది. మే 29, 30, 31 తేదీల్లో సెబాస్టియన్ - స్టీపెన్ సన్ సంభాషణలపై పదేపదే ఛార్జీషీటులో వివరాలను స్పష్టం చేసింది. మొత్తం 15 కాల్స్ ఈ మూడు రోజుల్లో ఉన్నాయని, ఇందులో స్టీఫెన్తో బాబు మాట్లాడినట్లు సంభాషణల్లో రికార్డయిందని తెలిపింది.
స్టీఫెన్తో సంభాషణ
సెబాస్టియన్, రేవంత్లు కలిసి మే 30న చంద్రబాబు వద్దకు వెళ్లినట్లు సండ్ర - సెబాస్టియన్ ఫోన్ సంభాషణలో బయటపడింది. రేవంత్, సెబాస్టియన్ చంద్రబాబు పార్టీ కార్యాలయంలో ఉండగా ఎమ్మెల్యే స్టీఫెన్తో డీల్ కోసం ప్రయత్నాలు జరిగాయి. సెబాస్టియన్ తన ఫోన్ నుంచి స్టీఫెన్కు ఫోన్ చేశారు. బాబు గారు మాట్లాడుతారని ఉంది.
ఇళ్లలో సోదాలు
మే 30న చంద్రబాబు తనతో మాట్లాడిన రోజు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో తన ఇంట్లో పోలీసులు సోదా చేసినట్లు సెబాస్టియన్కు స్టీఫెన్ ఫోన్లో తెలిపారు. ఇంటెలిజెన్స్ డిపార్టుమెంటు నుంచి వచ్చామని, బీరువా, అల్మారాలు చెక్ చేసినట్లు తన భార్య ఫోన్లో చెప్పిందని సెబాస్టియన్కు స్టీఫెన్ తెలిపారు. తనత పాటు తెరాసలో పలువురు ఎమ్మెల్యే ఇళ్లలో కూడా సోదాలు చేసినట్లు సెబాస్టియన్కు చెప్పారు.
హోటల్లో క్యాంపుకు..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు తమ ఎమ్మెల్యేలతో క్యాంపు నడిపేందుకు టిడిపి భారీ స్థాయిలో ఏర్పాటు చేసినట్లు ఏసీబీ తన ఛార్జీషీటులో వివరించింది. రేవంత్ - సెబాస్టియన్ మధ్య సాగిన సంభాషణల్లో క్యాంపు ఏర్పాట్లు, నోవాటెల్ కేంద్రంగా సాగిన వ్యవహారాలు వెలుగు చూసినట్లు ఏసీబీ తెలిపింది. స్టీఫెన్ను తీసుకొని నోవాటెల్ హోటల్కు రావాలని సండ్ర, రేవంత్లు సెబాస్టియన్కు సూచించారు. కానీ స్టీఫెన్ అక్కడకు వచ్చేందుకు ఇబ్బంది పడుతున్నారని, ఇంట్లోనే కలుద్దామని సెబాస్టియన్ వారికి చెప్పారు.
హోటల్ బుక్ చేసిన ఎర్రబెల్లి
కొనుగోలు చేస్తున్న ఎమ్మెల్యేల క్యాంపు కోసం ఎర్రబెల్లి దయాకర రావు నోవాటెల్లో 9 గదులను బుక్ చేసినట్లు ఆ హోటల్ ఫైనాన్స్ డైరెక్టర్ ఏసీబీకి వాంగ్మూలం ఇచ్చారు. మే 30 నుంచి జూన్ 1వ తేదీ 2015 (మూడు రోజులు) 9 గదులు బుక్ చేసినట్లు వాంగ్మూలం ఇచ్చారు. 109, 123, 131, 138, 140, 141, 225, 480, 646 నంబర్ రూంలను బుక్ చేసినట్లు చెప్పారు.
బాబు పేరు 22సార్లు
అనుబంధ ఛార్జీషీటులో ఏసీబీ 22సార్లు బాబు పేరును ప్రస్తావించింది. రేవంత్, సెబాస్టియన్, సండ్ర, మత్తయ్య, స్టీఫెన్లు తమ సంభాషణల్లో పదేపదే చంద్రబాబు, బాబు, సర్.. అంటూ 22సార్లు ప్రస్తావించారు. దీంతో ఎమ్మెల్యేల కొనుగోలులో చంద్రబాబు పాత్ర కీలకంగా కనిపిస్తోందని' అందులో సాక్షి పేర్కొంది.