ఓటుకు నోటు, సుప్రీం ఝలక్: 'ఇబ్బందికరమే చంద్రబాబు తప్పించుకోలేరు'
ఎన్నో కేసుల్లో విచారణ జరగకుండా స్టేలు తెచ్చుకున్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో తప్పించుకోలేరని ఆళ్ల రామకృష్ణా రెడ్డి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్/న్యూఢిల్లీ: ఎన్నో కేసుల్లో విచారణ జరగకుండా స్టేలు తెచ్చుకున్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో తప్పించుకోలేరని వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు.
ఈ కేసులో తాము గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. 'మన వాళ్లు బ్రీఫ్డ్ మీ' అన్న వాయిస్ చంద్రబాబుదే అని ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధారించిందని తెలిపారు. అయితే తెలంగాణ ఏసీబీ ఈ కేసును పక్కన పెట్టిందన్నారు.
'అసెంబ్లీ ప్రారంభం కాగానే.. ఓ సీఎంకు సుప్రీం నోటీసులు పెద్ద విషయమే'
ప్రభుత్వా దాని పని మరిచినప్పుడు, నిందితులను కాపాడాలని ప్రయత్నిస్తున్నప్పుడు కేసుతో సంబంధం లేని మూడో వ్యక్తి జోక్యం చేసుకొని కోర్టును ఆశ్రయించవచ్చునని చెప్పారు. నేరం అనేది ఎవరి దృష్టికి వచ్చినా కోర్టును ఆశ్రయించవచ్చన్నారు.
కాగా, ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని విచారించాలంటూ వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. తెలంగాణ ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబులకు నోటీసులు జారీ చేసింది.
జస్టిస్ బాబ్డే, జస్టిస్ లావు నాగేశ్వరరావుతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు నిర్ణయించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు సుదీర్ఘంగా ఉందని, కేసుని క్షుణ్నంగా విచారిస్తామని సుప్రీం కోర్టు పేర్కొంది. హైకోర్టులో వ్యాజ్యాన్ని కొట్టి వేయడంతో ఆళ్ల సుప్రీంకో ర్టును ఆశ్రయించారు.
ఆళ్ల రామకృష్ణా రెడ్డి పిటిషన్ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించడం చంద్రబాబుకు గట్టి దెబ్బే. ఇలాంటి కేసులు తన పైన ఎన్నో వేశారని, ఏదీ నిలబడలేదని చంద్రబాబు చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ కేసు కూడా నిలబడదని ఆయన అభిప్రాయపడ్డారు.
నాడు ఏసీబీకి..
ఓటుకు నోటు కేసులో దర్యాఫ్తు సక్రమంగా జరగడం లేదని, ఏసీబీ అధికారులు చంద్రబాబు పాత్రపై దర్యాఫ్తు చేయడం లేదని ఆళ్ల ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో గత ఏడాది ఆగస్టు 8న ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన ప్రత్యేక న్యాయస్థానం దీనిపై దర్యాఫ్తు చేయాలని ఆదేశిస్తూ గత ఏడాది ఆగస్టు 29న ఉత్తర్వులు ఇచ్చింది
చంద్రబాబు సవాల్
ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ చంద్రబాబు సెప్టెంబర్ 1న హైకోర్టును ఆశ్రయించారు. సెప్టెంబర్ 2న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆళ్ల సుప్రీంను ఆశ్రయించగా.. ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లో తుది విచారణ జరపాలని హైకోర్టును సుప్రీం ఆదేశించింది.
వాస్తవం వెలికి తీయాలని..
అనంతరం ఓటుకు నోటు కేసులో ఏసీబీ దాఖలు చేసిన ఛార్జీషీటులో 22సార్లు చంద్రబాబు ప్రస్తావన వచ్చినట్లుగా ఉంది. ఆయన పాత్రపై దర్యాఫ్తు చేయడం లేదని ఆళ్ల హైకోర్టుకు నివేదించారు. అనంతరం ఏసీబీ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. ఆయన ప్రయివేటు పిటిషన్ దాఖలు చేయగా.. వాస్తవం ఉందో లేదో చెప్పాలని ప్రత్యేక న్యాయస్థానం ఏసీబీని ఆదేశించింది. కానీ ఏసీబీ అధికారులు మాత్రం చంద్రబాబు స్వర నమూనాల జోలికి వెళ్లలేదని పిటిషనర్ ఆరోపించారు.
అర్హత లేదని..
ఆ తర్వాత.. ఆళ్ల రామకృష్ణా రెడ్డికి ఈ కేసులో జోక్యం చేసుకునే అర్హత లేదని న్యాయస్థానం చెప్పింది. దీనిపై ఆళ్ల సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆళ్ల హైకోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో జోక్యం చేసుకునే అర్హత ఉందని చెప్పారు.
సుప్రీం కోర్టుకు..
నేరం ఎవరు చేసినా, ఆ నేరాన్ని చూసిన వ్యక్తి కోర్టును ఆశ్రయించే హక్కు ఉందని చట్టం, సుప్రీం కోర్టు తీర్పులు చెబుతున్నాయని ఆళ్ల వాదన. చంద్రబాబు తెలంగాణలో నామినేటెడ్ ఎమ్మెల్యేను రూ.5 కోట్లకు కొనాలని చూశారని, ఇది అవినీతి కిందకే వస్తుందని ఆళ్ల పేర్కొన్నారు. ఈ విషయమై ఫోన్లో మాట్లాడారని, అది చంద్రబాబు గొంతు అని కూడా నిర్ధారించారని తెలిపారు. చంద్రబాబును విచారించలేదని చెప్పారు. ఈ వ్యాజ్యంపై సోమవారం జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది.
చంద్రబాబుకు సెట్ బ్యాక్
ఇదిలా ఉండగా, ఏపీ అసెంబ్లీ ప్రారంభమైన రోజే, అలాగే తనయుడు నారా లోకేష్ ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన మొదటి రోజే.. సుప్రీం కోర్టు ఓటుకు నోటు కేసు పిటిషన్ను విచారణకు స్వీకరించడం చంద్రబాబుకు పెద్ద సెట్ బ్యాక్ అంటున్నారు. చంద్రబాబు కేసు నుంచి తప్పించుకునేందుకు ఏపీకి అన్యాయం చేశారని ఆళ్ల ఆరోపిస్తున్నారు. కేసు నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు రాజీపడ్డారని, సుప్రీం నిర్ణయం ఏపీకి మంచి జరుగుతుందన్నారు.