రేవంత్ 30 రోజులు జైల్లోనే, విచారణ పూర్తైంది: తెలంగాణ ఏసీబీకి సుప్రీం షాక్
న్యూఢిల్లీ: అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి చుక్కెదురయింది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ను సుప్రీం కోర్టు శుక్రవారం నాడు కొట్టివేసింది.
ఓటుకు నోటు కేసులో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పైన సుప్రీం కోర్టులో శుక్రవారం మధ్యాహ్నం వాదనలు ప్రారంభమయ్యాయి. ఏసీబీ తరఫున కపిల్ సిబాల్, దుశ్యంత్ దవే, హరేన్ రావెల్లు వాదనలు వినిపించారు.
సెక్షన్ 164 ప్రకారం వాంగ్మూలం నమోదు చేశారని సుప్రీం కోర్టు తెలిపింది. రేవంత్ రెడ్డి 30 రోజులు జైల్లోనే ఉన్నారని న్యాయస్థానం పేర్కొంది. ఒక్క రోజు మాత్రమే జైల్లో ఉండి మరుసటి రోజు బెయిల్ వస్తే దానిని పరిశీలించవలసి ఉంటుందని, రేవంత్ నెల రోజులు జైలులో ఉన్నారని సుప్రీం తెలిపింది.
రేవంత్ రెడ్డిని మళ్లీ కస్టడీలోకి తీసుకొని ఏం చేస్తారని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. నాలుగు రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారించారని గుర్తు చేసింది. రేవంత్ రెడ్డిని జైల్లో ఉంచాల్సిన పని లేదని, ఆయనకు బెయిల్ మంజూరు చేసేందుకు హైకోర్టు సహేతుకమైన కారణాలనే పేర్కొందని తెలిపింది.
విచక్షణాధికారాన్ని ఎక్కడా దుర్వినియోగం చేయలేదని చె్పింది. రేవంత్ అరెస్టయిన మర్నాడే బెయిల్ వచ్చి ఉంటే తప్పుపట్టి ఉండవచ్చునని అభిప్రాయపడింది. ఈ కేసులో ఇప్పుడు జోక్యం చేసుకోమనింది. రేవంత్ బెయిల్ నిబంధనలు ఉల్లంఘిస్తే అఫ్పుడు తమ తలుపు తట్టవచ్చునని సూచించింది.
రేవంత్ రెడ్డి, ఉదయ్ సిన్హా, సెబాస్టియన్లకు బెయిల్ ఇవ్వడంపై ఏసీబీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై తెలంగాణ ఏసీబీకి గట్టి షాక్ తగిలింది. హైకోర్టు తీర్పు విషయంలో జోక్యం చేసుకోలేమని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. రేవంత్ రెడ్డి తరఫున ప్రముఖ న్యాయవాది రాంజెత్మలానీ వాదించారు.